Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కందనవోలు కర్నూలు గా ఏలా మారింది - కొండారెడ్డి బురుజు ప్రత్యేకత - Kondareddy buruju

కొండారెడ్డి బురుజు: కర్నూలు నగరానికి గల వైభవానికి చిహ్నమైన కొండారెడ్డి బురుజు కవి కలాన్ని, ఛాయాచిత్ర గ్రాహకులను ఎంతగానో ఆకర్షిం...

కొండారెడ్డి బురుజు: కర్నూలు నగరానికి గల వైభవానికి చిహ్నమైన కొండారెడ్డి బురుజు కవి కలాన్ని, ఛాయాచిత్ర గ్రాహకులను ఎంతగానో ఆకర్షించింది. గత ఇరవై అయిదేళ్ళ నుండి మరింత ముందుకెళ్ళి ఏకంగా సినీ కెమెరానే ఆకట్టుకున్నది. ఈ దుర్గం నాటి విజయనగర సామ్రాజ్యపు దుర్భేద్యమైన ధీమత్వానికి, విలక్షణమైన వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రాయల కాలం నాటి రాజసాన్ని, నవాబుల తేజో వికాసాన్ని, కొండారెడ్డి విషాదాన్ని తనలో దాచుకుని కర్నూలు పాత బస్టాండు దగ్గర, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సమీపంలో హుందాగా నిలిచిఉన్న ఈ బురుజు రాయలసీమ ఘనకీర్తికి సాక్ష్యం. చరిత్ర అధ్యయనానికి  గవాక్షం. 

2303 సంవత్సరాల చరిత్ర కల్గినది కర్నూలు నగరం. నందులు, మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు, విజయనగర రాజులు, బిజాపుర సుల్తానులు, మొగలులతోబాటు ఆంగ్లేయుల పాలనకు ఇది మౌనసాక్షి. 

కోటకు నాలుగు వైపులా ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు బురుజులు శిధిలమైపోయాయి. పూర్వం కందనవోలు పట్టణానికి పశ్చిమ, తూర్పు దిక్కుల్లో తుంగభద్రా నది, దక్షిణాన హంద్రి, ఉత్తరాన భూభాగం కల్గిన కోట ఉండేది. 

1529-1549 మధ్యకాలంలోఅబ్దుల్ నవాబ్ కందనవోలు ను జయించి 1618వరకూ పాలించాడు. బిజాపూర్ సుల్తాన్ లను ఔరంగజేబు ఓడించడంతో కందెనవోలు మొగలుల వశమైంది. ఔరంగజేబు ప్రతినిధిగా ఫియాజుద్దీన్ పరిపాలించాడు. 

1733-1752 మధ్యప్రాంతంలో హిమాయత్ ఖాన్ పాలనలో ప్రకృతి వైపరీత్యాలవల్ల ఈ కోట కొంత భాగం దెబ్బతినింది. పిదప ఫ్రెంచి వారి ముట్టడితో మరికొంత భాగం దెబ్బతినింది. 1751 మార్చి 15న ఫ్రెంచి సైన్యం కందనవోలు కోటపై ఫిరంగులతో దాడి చేసింది. ఆ తర్వాత పెద్దసోమ భూపాలుడు, చిన్నసోమ భూపాలుడు, రామరాయలు కందనవోలును పాలించారు. 

1823-1839 వరకు పాలించిన రసూల్ ఖాన్ కోటపై ఉన్న మక్కువతో  దానికి మరమ్మత్తులు చేయించాడు.ఈస్ట్ ఇండియా కంపెని రసూల్ ఖాన్ ను తొలగించి కందనవోలు ను స్వాధీనం చేసుకున్నారు. 1947 వరకూ ఆంగ్లేయుల ఆధీనంలోనే ఉండింది. 

కాలక్రమంలో కందనవోలు కర్నూలు అయింది. 

కర్నూలు చుట్టూ నిర్మితమైన పెద్ద కోటలో నేటికీ మిగిలి ఉన్న బురుజే కొండారెడ్డి బురుజు. సాధారణంగా కోటలకు అవి నిర్మింపబడిన ఊరు లేదా నిర్మాత పేరిట పేరొస్తుంది. కానీ అచ్యుతరాయలు నిర్మించిన కర్నూలు కోటలోని ఒక భాగమైన ఈ బురుజుకు మాత్రం పేరు విషయంలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ బురుజుకు ఆ పేరు రావడం వెనుక స్వాతంత్ర్యస్ఫూర్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

నందికొట్కూరు పాలెగాడైన కొండారెడ్డి 1624 - 1640 మధ్యకాలంలో అప్పటి నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బిజాపూర్ సేనాని అయిన అబ్దుల్ వహాబ్  శిస్తు విధానాన్ని కొండారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినందున నవాబు,  కొండారెడ్డిని పట్టితెచ్చి కోటబురుజులోనే  ఉరితీశాడు. ఆ రోజుల్లోనే రాజధిక్కారంచేసి, రాజీలేని పోరాటం చేసి, ప్రాణత్యాగం చేసినందుకు గుర్తుగా, స్ఫూర్తిగా అప్పటినుండి ఆ బురుజును కొండారెడ్డి బురుజు అని పిలవడం మొదలెట్టారు. 

ఇంకో వాదన ప్రకారం అలంపురం సమీపంలో ప్రాగటూరు తిమ్మభూపాల్ రెడ్డి చిన్నాయన అయిన కొండారెడ్డి తిరుగుబాటు చేశాడని, ఆయనను తెల్లవారు ఈ బురుజులో బంధించారని అంటారు.

మరో వాదన ప్రకారం కల్లూరుకు చెందిన కొండారెడ్డి అనే భూస్వామి పేరుమీద దీన్ని నిర్మించి ఉండవచ్చని చెబుతారు. 

బురుజు నుండి అలంపురానికి సొరంగమార్గం ఉందని, రాణీవాసపు స్త్రీలు ఈ మార్గంగుండా తుంగభద్ర నదికి స్నానాలకు వెళ్తుండేవారనీ చెబుతారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తనకు సహకరించమని కోరడానికి కర్నూలు నవాబును ఈ బురుజులోనే కలిశాడు. అది తెలుసుకున్న ఆంగ్లేయులు బురుజును చుట్టుముట్టగా, బురుజులోని మెట్లగుండా సొరంగమార్గంలోకి ప్రవేశించి,  తుంగభద్రను దాటుకుని వెళ్ళాడని వనపర్తి, గద్వాల జమీందారులతో, హైదరాబాదు నవాబులో చర్చలు జరిపాడని ఐతిహ్యం

   -  కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారు ప్రచురించిన 2015 సంవత్సరపు కాలెండర్ ఆధారంతో.

No comments