పొనమరియప్పన్ లైబ్రరీ సెలూన్ - Ponmariyappan inspirational life Story - Megaminds

megaminds
1
పొన‌మరియప్పన్ లైబ్రరీ సెలూన్: ప్రధాని నరేంద్ర మోడీ “మన్ కీ బాత్” లో భాగంగా 25 అక్టోబర్ 2020 తమిళనాడుకు చెందిన పొన‌మరియప్పన్ అనే క్షురకుడి (మంగలి) గురించిన ప్రేరణదాయకమైన విషయం ప్రస్తావన చేయడం జరిగింది.

పొనమరియప్పన్ తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లా మిల్లేర్పురం వాసి. పొనమరియప్పన్ చిన్నవయసులో ఆర్థిక స్థోమత సరిగాలేని కారణంగా 8వ తరగతి వరకు చదువుకుని ఆ తరువాత మంగలి షాపు నడుపుతున్నారు. తను చేస్తున్న వృత్తిని ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తాడు. తన మంగలి షాపు కి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు మారుతున్న కాలం కారణంగా సెల్ పోన్ లో బొమ్మలు, గేమ్ లు చూడటం అతనకి నచ్చేది కాదు. అందుకని తను పుస్తకాలు చదవమని చెప్పేవాడు మొదటగా ఐదు పుస్తకాలు తన షాపులో ఉంచాడు. “నా ఆర్ధిక స్థితి సరిగాలేని కారణంగా చదువు మానేశాను. కానీ అందరిచేత చదివించాలి” అనేది అతని కోరిక కూడా అందుకు దోహదపడింది.

ఎప్పుడైతే ఆ ఐదు పుస్తకాలు అక్కడ ఉంచడం జరిగిందో ఆ రోజు నుండి ఒక్కోక్కరుగా సెల్ మానేసి పుస్తకాలు చదవడం ప్రారంభంచారు. అయితే ఇది ఒక్కరోజులో జరగలేదు. కొంత మంది పిల్లలు, యువకులు పొనమరియప్పన్ ని కోపగించుకునే వారు. కానీ అతను అందరికీ‌ ఓపికగా, లౌక్యంగా నచ్చ జెప్పేవాడు. రవి అనే ఒక పిల్లవాడైతే పొనమరియప్పన్ పై వాళ్ళ నాన్నకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా ఓపికతో పిల్లాడి తండ్రికి పుస్తకాలు చదివితే వచ్చే లాభాలు, జ్ఞానం గురించి వివరించాడు. ఇలా ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుని క్షురశాలను గ్రంథాలయం మార్చేశాడు.

పొనమరియప్పన్  చెప్తున్నదాని ప్రకారం ఈరోజు ఆ క్షౌరశాల గ్రంధాలయంలో తమిళ మరియు ఆంగ్ల భాషలలో 900 పుస్తకాల పైబడి సేకరణ ఉంది. పొనమరియప్పన్ మరొక ఆలోచన కూడా చేశాడు. కస్టమర్స్ తమ వంతు వరకు వేచి ఉండే సమయంలో పుస్తకాలు చదివితే 30% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. దాంతో చాలామంది పుస్తకాలు చదివి దేశంలో జరిగే అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. ఒక కస్టమర్ అయితే “పొనమరియప్పన్ వలన‌ మాకు దేశంలో రోజూ జరిగే ఎన్నో విషయాలు, నెలలో ఒకసారి ముఖ్యమైనవి తెలుసుకోగలుగుతున్నాము” అని ఆనందం వ్యక్తం చేశాడు.

పొనమరియప్పన్ కేవలం ఐదు పుస్తకాలతో ప్రారంభిన లైబ్రరీ నేడు తత్వశాస్త్రం నుండి సైన్స్ థ్రిల్లర్స్, కల్పన నుండి జానపద కథలు, మతం మరియు పురాణాల నుండి నైతిక కథలు మరియు అద్భుత కథల వరకు సేకరణగా నిలిచింది. పొనమరియప్పన్ ఎప్పుడూ అంటుంటారు నేను చదువుకోలేదు కానీ నా షాపుకొచ్చే ప్రతి ఒక్కరి చేత మంచి విషయాలు చదివిస్తాను. కేవలం పుస్తక పఠనం ద్వారా జ్ఞానం లభిస్తుంది. పిల్లల‌ మెదడుకు పదును పెడుతుంది. విద్యార్థులు వేగంగా ఆలోచించగలిగే బుద్ది, గుణ వికాసం జరుగుతుంది’ అని‌. 

అలాగే ఆడియో వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. దీనిలో అతను సుగి శివం, నెల్లాయ్ కన్నన్ సహా ప్రఖ్యాత తమిళ వక్తల ప్రసంగాలు. తమిలారువి మానియన్ మరియు భారతి బాస్కర్ వంటి పెద్దలు మాట్లాడిన సందేశాలను కూడా వినిపిస్తుంటాడు.

పొనమరియప్పన్ చొరవకు అనేక వర్గాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. పొనమరియప్పన్ అభిమాన రచయిత ఎస్ రామకృష్ణన్ కూడా అతని ప్రయత్నాలను ప్రశంసించారు. ట్యుటికోరిన్ ఎంపి కనిమోళి పొనమరియప్పన్ సేకరణకు 50 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు.

ఈ ప్రేరణదాయకమైన విషయం గురించి గురించి మన్‌ కీ బాత్ లో మోడీజీ ప్రస్తావన చేస్తూ దేశంలో వున్న 130 కోట్ల మంది ప్రజలూ తమిళనాడు పొనమరియప్పన్ నుండి  స్పూర్తిని‌ పొందాలని తెలిపారు. 

ఈ సందర్భంగా యోగి అరవిందులు చెప్పిన అమృత వాక్కును‌ మననం చేసుకుందాం. ప్రేరణనివ్వడమే అసలైన పని. నిజంగా ప్రేరణకలిగించే శక్తి వున్న మాటను పలికితే అది ఎండిన ఎముకలలో కూడా జీవాన్ని నింపుతుంది. ప్రేరణ దాయకమైన బ్రతుకు బ్రతికితే అది వేలకొద్దీ దేశభక్తులని తయారుచేస్తుంది. -రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


Tags

Post a Comment

1 Comments
  1. Is extardinary thinking you are great in society. 👏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
Post a Comment
To Top