veda vyasa biography in telugu - వేదవ్యాసుడు - వ్యాసపూర్ణిమ - గురుపూర్ణిమ

megaminds
1
వేదవ్యాసుడు: వేదవ్యాసుడు సత్యవతీ పరాశరుల పుత్రుడు. వశిష్టుని మునిమనుమడు. ఇతనికే కృష్ణ ద్వైపా యనుడు, బాదరాయణుడు అని కూడ పేర్లు. యమునా నదీ ద్వీపంలో కృష్ణ(నల్లని) వర్ణంతో జన్మించినాడు గావున కృష్ణద్వైపాయనుడని పిలువబడినాడు. ప్రపంచ వాజ్మయంలోనే ఇతనికి సమానమైన విద్వాంసుడు మనకు గోచరించడు. అందుకే "వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం” అని లోకోక్తి.

వ్యాసుడు వేదవాజ్మయాన్ని లోతుగా అధ్యయనం చేసి పలువురికి ఉపయోగ పడునట్లు క్రమపద్ధతిలో సవరణలు, విభజనలు గావించి ప్రసరింపచేసినాడు అంటే వేదాలను విన్యాసమొనర్చినాడు కాబట్టి వేదవ్యాసుడన్నారు. శ్రీకృష్ణుడు “మునీనాం అప్యహం వ్యాసః” అనగా మునులలో నేను వేదవ్యాసుడను అని గీతలో అన్నాడు. వ్యాసుడు తన శిష్యులలో పైలునకు ఋగ్వేదమును, వైశంపాయనునకు యజుర్వేదమును జైమినికి సామవేదమును, సుమంతునకు అధర్వవేదమును అప్పగించి లోకమున ప్రసరింపజేసినాడు. వీరు వేదములను పరిరక్షించారు. అందుకే ప్రతి హిందువు నిత్యం వీరికి జలాంజలి సమర్పించాలి.

వేదవ్యాసుడు తత్త్వజ్ఞానం విద్వాంసుల వద్ద మాత్రమే ఉండడం సముచితం కాదు. అది సార్వజనికం కావాలి, సామాన్య జనుల వద్దకు వెళ్ళాలి అనే ఆలోచనలో కథల రూపంలో అష్టాదశ పురాణాలను రచించి ప్రజలకు ఉత్తమ మార్గదర్శనం లోకానికి మహోపకార మొనర్చినాడు. వీటిలోని భాగవత పురాణం చిత్తశాంతిని కలిగిస్తుంది. పంచమ వేదం వంటి మహాభారత గ్రంథాన్ని రచించి ఒక ఇతిహాస కారకుడుగా, చారిత్రకుడుగా, ఆధ్యాత్మికవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజనీతివేత్తగా లోకప్రసిద్ధి వేదవ్యాసుడు పరిపూర్ణతత్త్వజ్ఞానంతో బ్రహ్మసూత్రములను రచించాడు. నాలుగు అధ్యాయాలు, పదహారు పాదాలు ఐదువందల యాభై సూత్రాలు. వాటిలో విశ్వంలోని ఏ యొక్క తాత్త్విక విచారధారను విడిచిపెట్టకుండా ఆత్మ-అనాత్మల విషయంతో సహా సరళ సుందర శైలిలో చర్చించి తత్త్వోపదేశం చేశాడు.

లక్క ఇంటినుండి తప్పించుకొని వెళ్ళుచున్న పాండవులకు వ్యాసుడు కనిపించి ధర్మమును పాటింపుమని హితవులు చెప్పి ధర్మపక్షమైన పాండవపక్షం వెనుక ద్రుపద మహారాజు ప్రచండశక్తి ఉండాలనే భావనతో అర్జునుని ద్రౌపదీ స్వయంవరానికి పంపిచేను పంచపాండవుల పత్నిగా నిర్ణయించాడు. "వ్యాసుడు చెప్పాడంటే అడిగేదేముంది? అది యోగ్యమైనది ధర్మబద్ధమైనదే అయి ఉంటుంది" అని ప్రజలు భావించేలా సమాజాన్ని ప్రభావితం చేసినాడు. వ్యాసుడు చేసిన పని సరైనదే అనే సామాజిక దృఢనిశ్చయాన్ని కలిగించాడు.

వేదవ్యాసుడు మేరునగముపై శివుని గూర్చి తపస్సుచేసి రాగాతీతుడైన పుత్రునిపొందాడు. అతడే శుకమహర్షి వ్యాసుడు కాశీపట్టణంలో నివసించు చునప్పుడు ఒక సారి ఏ ఇంటను భిక్ష లభించకపోవుటచే కాశీపట్టణమును శపించబోగా పార్వతి అడ్డుపడి అతని క్షుద్బాధతీర్చి కాశీ బహిష్కరణ గావించింది. ఎంతటి వారైనను చేసిన తప్పునకు శిక్ష అనుభవింపక తప్పదు కదా!.
వ్యాసుడనునది ఒక్కని పేరు కాదు. అది యొక వ్యవస్థ అది యొక పీఠము, ద్వాపర యుగమందు ఆర్ష విద్యా ధర్మము లొకొక్కనిచే విస్తరింపబడుతుంటాయి, ద్వాపరమున స్వయంభువు, ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వ్యాసులైనారు, పక్షుడు, బృహస్పతి, వసిష్ఠుడు, త్రివరుడు, మొదలగువారు వ్యాసులై ఆ స్థానమనలంకరించి వేద ప్రసార ధర్మమును నిర్వహించినారు. ఇప్పుడు మనం చదుకుంటున్న ఈ పరాశర పుత్రుడు ఇరువది యేడవ వ్యాసుడుగ లోక ప్రసిద్ధుడు. అలరించిన రోజునే మనం వ్యాసపూర్ణిమగ గురుపూర్ణిమగ స్మరించుకుంటాం.

మానసపుత్రుడైన అపాంతరతముడను వాడే ఈ వేదవ్యాసులుగా అవతార మెత్తినాడు. అందుకే వ్యాసుడు సామాన్య మానవుడు కాడు. వ్యాసపీఠము వాజ్మయ పఠనీయ దేవతా పీఠము. దాని నుండి తత్త్వజ్ఞానము, వ్యాసుని బుద్ధి మరియు గణపతి కలములనే త్రివేణీ సంగమము నుండి జాలువారిన ఆర్షవాజ్మయ జలధార. దీన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుటతో మనం పునీతులం కావాలి.
అచతుర్వదనో బ్రహ్మ | ద్విబాహు రపరోహరి:
అఫాలలోచనః శంభుః ! భగవాన్ బాదరాయణః!
నాల్గుముఖములు లేనప్పటికిని బ్రహ్మ వంటివాడు, నాలుభుజములకు బదులు రెండు భుజములు కలిగినట్టి విష్ణువు వంటివాడు. లలాటమునందు నేత్రం లేనప్పటికిని సాక్షాత్తు శివుని వంటివాడు ఈ భగవాన్ బాదరాయణుడు మనమంతా ధర్మమార్గంలో పయనించడమే వారికి మనం సమర్పించే వందనం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia



Post a Comment

1 Comments
Post a Comment
To Top