గద్వాల సోమనాద్రి రెడ్డి జీవిత చరిత్ర - Gadwal Somanadri Reddy

megaminds
0
గద్వాల నల సోమనాద్రి రెడ్డి జీవిత చరిత్ర - SOMNATH GADWAL  - Gadwal Somanadri Reddy

అది క్రీ.శ. 1750 ప్రాంతం, నేటి గద్వాల ఓ అరణ్య ప్రాంతంగా ఉండేది. దానికి కొద్ది దూరంలోని పూడూరు రాజధానిగా పాలన సాగించిన వాడు నల సోమనాద్రి రెడ్డి. అతడి భార్య లింగమ్మ. సోమనాద్రి వేట కోసం అడవికి వచ్చి, అది కృష్ణానదికి సమీపంగా ఉన్నందున, తన రాజధాని అక్కడ ఉంటే బాగుంటుందని భావించి, కోట కట్టడం మొదలుపెట్టాడు. అక్కడికి దగ్గర్లోని ఉప్పేడు కోట పాలకుడు సయ్యద్ దావూద్మీయా ఆ స్థలం తనదని చెప్పి, అక్కడ కోట కట్టడానికి వీల్లేదని అభ్యంతర పెట్టాడు. కార్యవాది అయిన సోమనాద్రి, కోట కట్టుకున్నాక సయ్యదుకు కప్పం కడతాను లెమ్మని నచ్చజెప్పి, దుర్గనిర్మాణాన్ని పూర్తి చేశాడు. తరువాత దానిచుట్టూ నగర నిర్మాణం కూడా చేసి, రాజధానిని అక్కడకు మార్చుకున్నాడు. సైన్యాన్ని సమకూర్చుకుని కప్పం లేదు, గిప్పం లేదు పొమ్మని దావూద్ మియాకు జవాబు చెప్పాడు.

దావూద్ మియాకు వెర్రికోపం వచ్చింది. సోమనాద్రి మీదకు యుద్ధానికి వచ్చాడు. అతడికి సాయంగా రాయచూరు నవాబు బసర్ జంగు, ప్రాగటూరు నవాబు ఇదురు సాబు సైన్యాలతో దిగారు. అరగిద్ద మైదానంలో రెండు పక్షాల సైన్యాలకు పెద్ద యుద్ధం జరిగింది. సోమనాద్రి ధాటిని తట్టుకోలేక బసర్ జంగు తన రాయచూరు వైపు, ఇదురు సాబు ప్రాగటూరు వైపు పారిపోయారు. దావూద్ మియా తన ఏనుగుమీద ఉప్పేడు వైపు పారిపోతుండగా, అశ్వారూఢుడైన సోమనాద్రి అతడిని అడ్డగించాడు. దావూద్ మియా ప్రాణభిక్ష కోరి, ఇంకెప్పుడూ కలహానికి దిగనని ఒట్టు పెట్టుకుని, తన నగారాను, పచ్చజండాను, ఏనుగును సోమనాద్రికి సమర్పించుకున్నాడు. సోమనాద్రి వాటిని స్వీకరించి, అతడిని ఉప్పేడుకు పోనిచ్చాడు.

దావూద్ మియా మరునాడే తిన్నగా హైదరాబాద్ వెళ్లి, నైజామ్ నవాబు నాసిరుద్దాలాను కలుసుకుని, తన పరాభవాన్ని గురించి చెప్పుకుని ఏడ్చాడు. అతడి కోరిక మీద నిజాం పెద్ద సైన్యంతో గద్వాల మీదకు యుద్ధానికి వచ్చాడు. బసర్ జంగ్, ఇదురు సాబు మళ్లీ సైన్యాలతో వచ్చి, దానికి జత కలిశారు. ఇంకా కర్నూలు నవాబు దావూద్ ఖాన్, మరికొందరు కూడా తోడయ్యారు. అంతా కర్నూలు సమీపంలో తుంగభద్ర నది దక్షిణపు ఒడ్డున నిడుదూరు సమీపంలో డేరాలు వేశారు. నది అవతలి ఒడ్డున కలుగొట్ల గ్రామం వద్ద సోమనాద్రి తన సైన్యాలతో విడిది చేశాడు.

తెల్లవారక ముందే సోమనాద్రి సైన్యాలతో నదిని దాటి వచ్చి, నవాబుల సైన్యాల మీద విరుచుకుపడ్డాడు. సాయంత్రం అయ్యే సరికే గద్వాల సైన్యాలు శత్రుసైన్యంలో చాలా భాగాన్ని హతం చేసి, చీకటి పడే లోపునే తుంగభద్రను దాటి వెనుకకు వెళ్లి, కలుగొట్లలోని శిబిరాలలో సేదదీరాయి.

సోమనాద్రి విజృంభణను చూసి నైజాం నవాబుకు ముఖం తిరిగిపోయింది. ఆ రాత్రి అతడు దర్బారు తీర్చి, అందరినీ ఒకే ఒక ప్రశ్న అడిగాడు. 'ఈ సోమనాద్రిని పడగొట్టడం ఎలాగ?' కొంతసేపటికి ఒకడు జవాబిచ్చాడు. "సోమనాద్రి గుర్రాన్ని అతడి నుంచి తప్పించగలిగితే, మనకు ఏమైనా అవకాశం ఉంటుంది." సోమనాద్రి యుద్ధాశ్వం అసామాన్యమైనది. చిత్రవిచిత్ర గతులతో, తన రాజు కోరిన విన్యాసాలు చేయనేర్చినది. ఆ తెల్లని గుర్రం మీద నల్లని దేహవర్ణంతో, సాముగరిడీలతో కండలు తిరిగిన సోమనాద్రి యుద్ధరంగంలో వీరవిహారానికి దిగితే, ఎదుటి పక్షం వారికి యమదర్శనమే

‘తెల్లవారేసరికి ఎవరైనా సోమనాద్రి గుర్రాన్ని ఇక్కడకు తేగలిగితే, వాడికి ఒక జాగీరు ఇస్తాను' అని నైజాం నవాబు అప్పటికప్పుడు ప్రకటించాడు. చివరకు ఒక సైను (గుర్రాలకు మాలీష్ చేసేవాడు) తెగించి ముందుకు వచ్చాడు. రొంటిన కళ్లెం పెట్టుకుని, ఒక్కడూ బయలుదేరి, చీకట్లో గద్వాల సైన్యం శిబిరాలలో దూరాడు. వెతుక్కుంటూ, వెతుక్కుంటూ రాజుగారి అశ్వం ఉన్న శాలను సమీపించాడు. వాడి అదృష్టం బాగుండి, కాపలా వాళ్లు అప్పుడు గుర్రు పెట్టి నిద్ర పోతున్నారు. కళ్లాన్ని జాగ్రత్తగా తగిలించి, నెమ్మదిగా రాజాశ్వాన్ని బయటకు తెచ్చి, స్వారీ చేస్తూ వచ్చిన దారినే నిజాం శిబిరాన్ని చేరుకున్నాడు. ఆనందంతో పొంగిపోయిన నైజాం నవాబు అతడికి బంగారు కడియాన్ని బహూకరించాడు.

తెల్లవారింది. గద్వాల వారి స్కంధావారంలో కల్లోలం. రాజుగారి గుర్రం కనిపించలేదు. సోమనాద్రికి కుడి చెయ్యి పడిపోయినట్లు అనిపించింది. ఆనాటి యుద్ధం చాలా నిరుత్సాహకరంగా సాగింది. ఆ రాత్రి సోమనాద్రి సభ తీర్చాడు. “నా గుర్రాన్ని రేపు తెల్లవారే లోపల తీసుకువచ్చిన వారికి ఆ గుర్రం ఒకరోజులో ఎంత మేర తిరుగుతుందో అంత భూమిని ఈనాముగా ఇస్తాను" అని ప్రకటించాడు. హనుమప్ప నాయుడు అనే బోయసర్దారు దీనికి సిద్దపడ్డాడు.

జొన్నచొప్ప మోపును నెత్తిమీద పెట్టుకుని, హనుమప్ప నవాబుల సైనిక గుడారాల వద్ద తిరగసాగాడు. మోపు, ధర అడిగిన సిపాయికి "అయిదు రూపాయలు" చెప్పాడు.

"అరే పాగల్! అర్థ రూపాయి కట్టకు అయిదు రూపాయలు అడుగుతావా?" అన్నాడు సిపాయి. "ఇప్పుడు ఇలాగే ఉంది. మీ దండు వచ్చిపడినప్పటి నుంచి, పశువుల మేత దొరకడం లేదు" అన్నాడు హనుమప్ప. “పోరా పో" అన్నాడు సిపాయి. అందరి తోటీ అలాగే అనిపించుకుంటూ, ముందుకు సాగి, గద్వాల రాజాశ్వాన్ని కనుగొన గలిగాడు. అతడిని చూసి సిపాయిలు చొప్పకట్టను బేరం చేశారు. హనుమప్ప రూపాయి ధర చెప్పాడు. సిపాయిలు మోపు దింపించి, డబ్బు ఇచ్చి, వెళ్ళిపోయారు. హనుమప్ప కదల్లేదు. మరో సిపాయి వచ్చి, “ఎవరు నువ్వు” అని గదమాయించాడు. "సర్కార్! జొన్నమోపు ఇచ్చాను. ఎవరో సాయిబు డబ్బు ఇస్తానని వెళ్ళి, గంట అయినా రాలేదు. గరీబోణ్ణి, మీరైనా ఇప్పించండి బాబయ్యా” అన్నాడు. ఆ సిపాయి తన దారిన పోయాడు.

అటూ యిటూ చూసుకుని, ఎవరూ లేని, సమయంలో హనుమప్ప, సాలలో దూరి మూలనున్న గడ్డికుప్పను తన మీద పరచుకుని, వెల్లకిలా చేతులు చాచి పడుకున్నాడు. గుర్రం కాళ్లు విదలించి, కట్టుతాడు ఉన్న గూటాన్ని పెరికేసింది. అటుగా వచ్చిన ఓ సిపాయి, ఆ గూటాన్ని అందుకుని, మరో చోట గడ్డిమీద పెట్టి, నేలలోకి దిగగొట్ట సాగాడు. అది సరిగ్గా గడ్డి కింద ఉన్న హనుమప్ప అరచేతిలో దిగింది. ఎంతో బాధతో దానిని ఓర్చుకున్నాడు హనుమప్ప.

గుడారాలు మాటుమణిగాక హనుమప్ప లేచి కూచున్నాడు. కుడిచేయి కదిలించే అవకాశం లేదు. నడుముకు ఉన్న బాకును ఎడమ చేత్తో తీసి, కుడి చేతిని ఒక్క దెబ్బతో నరికేసుకున్నాడు. రక్తం నష్టమై స్పృహ తప్పాడు. తిరిగి స్పృహలోకి వచ్చాక, తెగిన చేతిని తలపాగతో చుట్టుకుని, ఎడమచేత్తో గుర్రాన్ని తీసుకుని, స్వారీ చేస్తూ డేరాలు దాటాడు. తలలెత్తి చూసిన సిపాయిలు, తమలోని వాడే నీళ్లు తాగించడం కోసం గుర్రాన్ని తీసుకువెళుతున్నాడని అనుకున్నారు.

గుర్రంతో సహా వచ్చిన హనుమప్ప సోమనాద్రి ఎదుట నిలచి ఎడమచేత్తో సలాం చేశాడు. సోమనాద్రి ఆగ్రహంతో కళ్లెర్రచేశాడు. హనుమప్ప జరిగినదంతా వివరించి, తెగిన చేతిని చూపించాడు. రాజు హనుమప్పను కావలించుకుని, అప్పటికప్పుడే దాన శాసనం రాసిచ్చాడు.

మరునాడు జయభేరిని మోగిస్తూ, గద్వాల సైన్యం నైజాం నవాబు సైన్యం మీద విరుచుకుపడింది. పోరు ఘోరంగా సాగింది. సాయంత్రమయ్యేసరికి ప్రాగటూరు, బళ్లారి, అదవోని నవాబులు ప్రాణాలు కోల్పోయారు. నిజాం సైన్యాలు వెనుదిరిగి పారిపోతుంటే, వాళ్ళను సోమనాద్రి వెంటబడి తరిమాడు. నిజాం సైన్యాలు కర్నూలు కోటలో దూరాయి. వాళ్ళను తరుముతూ వచ్చిన సోమనాద్రి కోటలో జొరబడ్డాడు. ఓ యాభై మంది సైనికులు లోపలకు చేరుకోవడంతోటే కోట ద్వారాలు మూతపడ్డాయి. గద్వాల సైన్యం బయటనే ఉండిపోయింది.

గద్వాల సర్దార్లు చాలా కంగారు పడ్డారు. కోటను బద్దలుకొట్టి, రాజును రక్షించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, కోటను ఛేదించలేకపోయారు. వాళ్లు రాజు ప్రాణాలపై ఆశ వదలుకుని, తిరిగి రావడానికి అనుమతించవలసిందని కోరుతూ తమ రాణి లింగమ్మ దేవికి కబురు పంపారు. వారికి సమాధానంగా ఆ వీరపత్ని గాజులు, చీరలు, పసుపు, కుంకం పంపింది. గద్వాల సర్దారులు పౌరుషపడి, శక్తులన్నీ కూడగట్టుకుని, మరునాడు సాయంత్రానికి కోటద్వారాలను పగులగొట్ట గలిగారు.

తీరా చూస్తే సోమనాద్రి బ్రతికే ఉన్నాడు. తనవద్ద ఉన్న పిడికెడు సైనికులతోనే ఆ రాత్రి, పగలు, భీకరంగా పోరాడి, శత్రువులు చాలామందిని నరికి, పోగులు పెట్టాడు. అతడి అనుచరులు కూడా చాలామంది చనిపోయారు. ద్వారాలు బద్దలు కావడంతోటే మిగిలిన అనుచరులతో కోట బయటకు వచ్చి తన సైన్యాన్ని చేరుకున్నాడు సోమనాద్రి.

నైజాం సైన్యాన్ని వెర్రి భయం ఆవహించింది. కొద్దిమంది అనుచరులతోనే నానా బీభత్సం చేసిన సోమనాద్రి, తన సైన్యంతో కలిశాక ఇంకెంత చేస్తాడో అని వారు బెంబేలెత్తారు. దానికి తోడు ఇప్పుడు కోటకు ద్వారం కూడా లేదు.

చావగా మిగిలిన గుత్తి నవాబు, రాయచూరు నవాబు ఇక తాము యుద్ధం చేయబోమన్నారు. దీనంతటికీ మూలకారణమైన ఉప్పేడు సయ్యదు మాడు ముఖం చేసుకుని కూచున్నాడు. సంధి చేసుకోవడం ఒక్కటే మార్గమని నిజాం మంత్రులు సలహా ఇచ్చారు. సంధిని కోరుతూ, సోమనాద్రి వద్దకు నిజాం తమ రాయబారిని పంపాడు. కర్నూలు నవాబుకు చెందిన కొంత రాజ్యభాగాన్ని, కర్నూలులోని కొండారెడ్డి బురుజు మీద పెట్టిన 'ఎల్లమ్మ ఫిరంగి' అనే పెద్ద ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ', 'లక్ష్మణ' అనే ఫిరంగులను, తనకు అప్పగించాలని సోమనాద్రి కోరాడు. నైజాం నవాబు అందుకు అంగీకరించక తప్పలేదు. సోమనాద్రి విజయోత్సాహంతో గద్వాలకు తిరిగి వచ్చాను.

హనుమప్పకు ఇచ్చిన మాట ప్రకారం, తన అశ్వం ఒక రోజులో తిరగగలిగినంత భూమిని బోయ హనుమంతప్ప నాయుడికి శాశ్వత ఈనాంగా సోమనాద్రి రాసి ఇచ్చేశాడు. హనుమంతప్ప గ్రామమైన బొచ్చెంగన్నపల్లిలో అతని వంశం వారు కొంత కాలం క్రితం వరకు కూడా ఆ భూమిని అనుభవిస్తూనే ఉన్నారు. గద్వాల పంచాంగ కర్తలు తమ పంచాంగాలలో ఇతర శకాలతో పాటు సోమనాద్రి శకాన్ని కూడా గుణిస్తూ వచ్చారు. గద్వాల సంస్థానం దానధర్మాలకూ, విద్యా పోషణకూ పేరు గాంచింది. సుప్రసిద్ధులైన తిరుపతి వేంకట కవులు గద్వాల ఆస్థానంలో శతావధానం చేశారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top