అమరసింగ్ రాథోడ్ గురించి తెలుసా? - About Amar Singh Rathore

megaminds
0
Amar Singh Rathore (అమర్ సింగ్ రాథోర్):
మొగల్ సామ్రాజ్యాన్ని షాజహాన్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో మార్వార్ సంస్థానాన్ని రాజా గజసింగ్ పరిపాలిస్తున్నాడు. అతడి పెద్ద కొడుకు అమరసింగ్ రాథోడ్ చిన్నతనం నుంచే మహాపరాక్రమశాలిగా పేరు పొందాడు. జాలిమ్ సింగ్ అనే బందిపోటు దొంగను పట్టి తెమ్మని రాజు గజసింగ్ తన కొడుకు అమర్ సింగ్ ను పంపాడు.

ఆ పనిమీద ఊళ్లు గాలిస్తోండగా ప్రజల ద్వారా జాలిమ్ సింగ్ ఉత్తముడని, కష్టాలలో ఉన్నవారికి, పేదలకు సహాయం చేసి ఆదుకుంటూ ఉంటాడని అమరసింగ్ కు తెలిసింది. చివరకు ఒక ఊరివద్ద జాలిమ్ సింగ్, అతని ముఠా కనిపించారు. అతడితో పోరాడి, బంధించి అమర్ సింగ్ "నువ్వు మంచివాడివని విన్నాను. ఇక ముందు దొంగతనాలు మానేస్తే నీకు క్షమాభిక్ష ఇప్పిస్తాను" అన్నాడు. అందుకు ఆ బందిపోటు ఒప్పుకున్నాడు. జాలిమ్ సింగు ను రాజు ముందుకు తీసుకురాగా ఆయన “ఇతడు మొగల్ చక్రవర్తి ఖజానా శకటాన్ని అడ్డం కొట్టి దోచుకున్నాడు. ఇతడికి శిరచ్ఛేదం చెయ్యవలసిందే” అన్నాడు.

అమరసింగ్ "ఇతడి ప్రాణాలు కాపాడతానని నేను మాట ఇచ్చాను. ఒక రాజపుత్రునిగా నా మాటను నేను నిలబెట్టుకుని తీరతాను. ఇతడి మీదకు ఎవరైనా వస్తే నా కత్తిని ఎదుర్కోవలసి ఉంటుంది” అన్నాడు. అందుకు ఆగ్రహించిన రాజు గజసింగ్ అమరసింగ్ కు రాజ్య బహిష్కారం విధించాడు. దానిని పాటించి రాజ్యం విడిచి వెళ్లిపోయాడు అమరసింగ్. అతడి పరాక్రమం గురించి విన్న మొగల్  పాదుషా షాజహాన్ అమరసింగ్ రాథోడ్ ను తన రాజధాని ఆగ్రాకు పిలిపించుకొని తన దర్బారులో మంచి పదవి ఇచ్చి నాగోర్ అనే జాగీరును ఇచ్చాడు.

నాగోర్లోకి పొరుగున ఉన్న బికనీర్ రాజ్యపు సైనికులు వచ్చి దోపిడీలు చేసి పోసాగారు. అందుకు ప్రతీకారంగా అమరసింగ్ తన భటులను బికనీర్ సంస్థానపు భూభాగాలలోకి పంపి దోపిడీలు చేయించాడు. బికనీర్ రాజు దీని గురించి పాదుషాకు ఫిర్యాదు చేశాడు. షాజహాన్ ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తన బావమరిది సలాబత్ ఖాన్ కు అప్పగించాడు.

సలాబత్ ఖాన్ కు అమరసింగ్ అంటే ఈర్ష్య. అతడు బికనీర్ రాజుకు అనుకూలంగా తీర్పు చెప్పేసి అమరసింగ్ రాథోడ్ కు లక్షదీనారాలు జరిమానా ? విధించాడు. వ్యవధి కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు జరిమానా చెల్లించి కదలమని ఆదేశించాడు. అంతటితో ఆగకుండా “నీవంటి కాఫిర్లను పాదుషా అనవసరంగా చేరదీసి గౌరవిస్తున్నారు” అన్నాడు.

అన్యాయపు తీర్పుతోనే కుతకుతలాడిపోతున్న అమరసింగ్ కు నిండు సభలో వజీర్ల, సర్దార్ల సమక్షంలో జరిగిన ఈ అవమానం మనిపించింది. “ఇదిగో, జరిమానా చెల్లిస్తున్నా, తీసుకో” అంటూ సర్రున కత్తి దూసి, ఒక్క వేటుతో సలాబత్ ఖాన్ శిరస్సును గాలిలోకి ఎగరగొట్టాడు. సభలో అంతా బిత్తరపోయారు. షాజహాన్ గుడ్లురుముతూ "అమరసింగ్ రాఠోడ్ ను పట్టుకోండి” అని తన సర్దార్లను ఆదేశించాడు. సభలోని నర్దార్లందరూ కత్తులు దూసి, అమరసింగ్ పైకి దూకారు అమరసింగ్ లాఘవంగా అటూఇటూ దూకుతూ, కత్తిని విచిత్ర గతులతో తిప్పుతూ, వాళ్లందరినీ నరికి, ప్రోగులు పెట్టాడు.

పాదుషా తన అంగరక్షక దళాన్ని "అమరసింగ్ ను పోనివ్వకుండా పట్టుకోండి. చంపెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్లందరూ రాజపుత్ర సింహాన్ని చుట్టుముట్టారు. అమరసింగ్ తన ఖడ్గాన్ని గిరగిర తిప్పుతూ ఒకరి తరువాత ఒకరిగా వాళ్లను నరికి పడేశాడు. “మీరు కూడా రావచ్చు పాదుషా వారూ! మీకూ ఇదే గతి పట్టించేందుకు సిద్ధంగా ఉన్నాను" అంటూ హుంకరించాడు అమరసింగ్. తనను రక్షించే వారు మిగలకపోయే సరికి సింహాసనం మీద కూచున్న షాజహాన్ చక్రవర్తి గజగజ వణకసాగాడు. ఒక గెంతులో సింహాసనం పైకి దూకాడు అమరసింగ్. అయితే, చక్రవర్తి చటుక్కున తప్పుకుని జనానాలోకి పారిపోయాడు. హతశేషులైన భటులు దర్బారులో ఆమూలా ఆమూలా నక్కి, హడలిపోతుండగా, అమరసింగ్ కోట నుంచి బయటకు వచ్చాడు.

పాదుషా ఆజ్ఞ ప్రకారం కోటద్వారాలు బంధించబడ్డాయి. అమరసింగ్ అశ్వారూఢుడై కోట బూరుజుపైకి ఎక్కి అక్కడి నుంచి వీధిలోకి దూకేశాడు. అశ్వం చనిపోగా మరొక అశ్వాన్ని తీసుకుని దానిపైన తన నాగోర్ సంస్థానానికి వెళ్లిపోయాడు. అతడిని వెన్నాడ వచ్చిన పాదుషా భటులను రాజపుత్ర సైనికులు నరికి పడేశారు.

మరునాడు షాజహాన్ చక్రవర్తి దర్బారులో బంగారు తట్టలో తమలపాకుల బీడాను ఉంచి, "అమరసింగ్ తల నరికి తేగల వీరుడు దీనిని తీసుకోవచ్చు" అన్నాడు. వజీర్లు, సర్దార్లు ముఖాలు దించుకున్నారు. అర్జున్ అనేవాడు ఆ బీడాను అందుకున్నాడు. అతడు అమరసింగ్ కు స్వయానా బావమరిది. అతడికి తన బావపై చాలాకాలంగా ఈర్ష్య, ద్వేషం గూడు కట్టుకుని ఉన్నాయి. పాదుషా అనుమతి తీసుకుని, అతడు అమరసింగ్ ఇంటికి వెళ్లి, “బావగారూ! చక్రవర్తి మీ స్నేహాన్ని కోరుతున్నారు. నాతో రండి ! మీకు సంధి కుదుర్చుతాను" అని చాలా బతిమాలి, ఒప్పించి, తనతో పాదుషా దగ్గరకు తీసుకువెళ్లాడు. సభలో షాజహాన్ సింహాసనం మీద కూచుని ఎదురు చూస్తున్నాడు.

ముందు రోజు అమరసింగ్ వీరవిహారాన్ని చూసి, కళ్లు చెదరిపోయిన ఓ ఫకీరు, "పాదుషా వారూ! ఇటువంటి సింహసమానులైన హిందూ వీరులున్న ఈ హిందూస్థాన్ను మనవాళ్లు ఎలా జయించగలిగారు?” అన్ని ప్రశ్నించాడు. షాజహాన్ చిరునవ్వు నవ్వి, “అది త్వరలోనే మీకు అర్థం అవుతుంది, చూస్తూ ఉండండి" అని బదులిచ్చాడు.

ఇంతలో అమరసింగ్ ను తీసుకుని సభాద్వారం వద్దకు వచ్చాడు అర్జున్. పౌరుషశాలి అయిన తన బావ పాదుషా ముందు తలవంచడని తెలిసిన అతడు, సభలో ప్రవేశించే ద్వారాన్ని పై సగం మూయించి చిన్నదిగా ఉంచాడు. అందులో నిలబడి ప్రవేశించడానికి వీలుకాకుండా ఉంది. అందులోంచి వెళ్లాలంటే తల వంచాలి. అందుకు అమరసింగ్ తిరస్కరించాడు. “అయితే, కాళ్లు ముందు లోపలికి పెట్టి, తలను వెనక్కు వంచి, దూరండి బావగారూ” అని సలహా ఇచ్చాడు అర్జున్. ఆ విధంగా అమరసింగ్ కాళ్లను ముందుగా ద్వారంలో పెట్టి, సగం దేహాన్ని ముందుకు దూర్చగానే, అర్జున్ తన బావగారి ఛాతీలో కత్తితో పొడిచాడు.

"ద్రోహీ!" అని అరుస్తూ, ప్రాణాలు వదులుతూనే అమరసింగ్, అర్జున్ పైకి కత్తి విసిరాడు. ఆ మోసగాడి ముక్కు తెగిపోయింది. కింద పడిపోయిన అమరసింగ్ తలకోసి, షాజహాన్ ముందుకు వెళ్లి సమర్పించాడు అర్జున్. "ఇప్పుడు తెలిసిందా, ఈ హిందూస్థాన్ని మనం ఎలా జయించగలిగేమో? ఈ అర్జున్ వంటి ద్రోహులు లేకపోతే రాజపుత్రులు ప్రపంచమంతటినీ జయించగలరు." అని ఫకీర్తో అన్నాడు షాజహాన్.

"అర్థమైంది. మరి ఈ గద్దార్ రాజపుత్రునికి నజరానా ఏమిస్తారు?" అని ఫకీర్ అడిగాడు. "తగిన నజరానానే ఇస్తాను. చూడండి" అన్నాడు పాదుషా. "షాజహాన్, అర్జున్ ముఖానికి మసి పూయించి, గాడిదపై రాజవీధుల్లో ఊరేగించి, తలకొట్టించాడు. అమరసింగ్ శవాన్ని ఆగ్రా కోటలో నేలమీద పడేయించి, "దీనిని తీసుకువెళ్లే ధైర్యం ఎవరు చేస్తారో చూస్తా” అని ప్రకటించాడు.

అమరసింగ్ వీరమరణం గురించి అతడి భార్య హరీరాణికి తెలిసింది. ఆమె తన మరిది భల్లూ సింగ్ కు "నేను సహగమనం చెయ్యాలి. మీ అన్న శరీరాన్ని తీసుకురండి” అని కబురు పంపింది. పాదుషా సైన్యం కాపలాగా ఉండగా, అది అసాధ్యమని భావించిన భల్లూ సింగ్ మౌనం వహించాడు. వీరనారి అయిన భల్లూ సింగ్ భార్య, "ఈ మధ్య మీ ఖడ్గం కాస్త తుప్పు పట్టినట్టుంది. పోనీ, మీరు ఇంట్లోనే కూచుని పిల్లల్ని ఆడించండి. మీ ఖడ్గం, కవచం నాకివ్వండి. నేను వెళ్లివస్తాను" అంది. పౌరుషం వచ్చిన భల్లూ సింగ్ తానే ఆ పనికి సిద్ధమయ్యాడు.

ఆరువందల మంది రాజపుత్ర వీరులతో నగర ద్వారం వద్దకు వచ్చాడు భల్లూ సింగ్. రామ్ సింగ్ అనే బాలయోధుడిని నూరు మందితో అక్కడ నిలిపి, నగర ద్వారం వెలుపల చితిని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. మిగిలిన అయిదు వందల మందిని. "ప్రాణాలు దాచుకోకండి" అని హెచ్చరించాడు. వాళ్లతో నగర ద్వారం లోపల ఉన్న పాదుషా సైనికుల మీద పడి, వాళ్లను హతమార్చి, ఆగ్రా కోటలోకి ప్రవేశించాడు. అన్నగారి కళేబరం పడి ఉన్న చోటుకి వెళ్లి, దానిని ఎత్తి, గుర్రం వేసుకుని, వెనుదిరిగే సరికి వేలకొద్దీ మొగల్ సైనికులు వచ్చి, వారిని చట్టుముట్టారు. అయిదు వందల మంది రాజపుత్రులూ, వాళ్లను ఖడ్డాలతో నరికి కుప్పలు కుప్పలుగా నేలకూల్చుతూ, శత్రు వలయాన్ని ఛేదించుకుంటూ నగర ద్వారం చేరారు. అప్పటికి వారిలో సగం మంది రాలిపోయారు. మిగిలిన వారిని ద్వారం వద్దనే నిలిపి. చితి వద్ద వేచి ఉన్న హరీ రాణికి అన్న శవాన్ని అందించాడు భల్లూసింగ్. భర్త కళేబరాన్ని ఒడిలో పెట్టుకుని ఆమె మండుతున్న చితిపై కూర్చుంది.

ద్వారం వద్ద నిలచి, మొగల్ సైనికులను నిరోధిస్తున్న రాజపుత్రవీరులు ఒకరొకరుగా వీరమరణం పొందారు. భల్లూసింగ్, రామ్ సింగ్, మిగిలిన వందమంది రాజపుత్ర యోధులు చితి చుట్టూ వలయంగా నిలచి, సాయంత్రం వరకూ మొగల్ సైనికులను చితివద్దకు రానీయకుండా ఘోరయుద్ధంతో కాపు కాశారు. భల్లూసింగ్ వళ్లంతా గాయాలై, నేలకూలే సరికి చితి పూర్తిగా కాలిపోయింది. అతడు తృప్తిగా ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకూ చితివద్ద మంత్రాలు చదివిన పురోహితుడు ఆ వెంటనే తానూ కత్తిపట్టి తురక సైనికులను చాలామందిని చంపి, వీరమరణం పొందాడు.

అన్ని వేలమంది మొగల్ సైన్యపు రక్షణ వలయాన్ని ఛేదించుకొని కొద్దిమంది రాజపుత్రులు ఆగ్రా కోటలో ప్రవేశించి తమ రాజు దేహాన్ని తీసుకుపోవడంతో షాజహాన్కు పరువంతా పోయినట్లైంది. అవమానం భరించలేక అతడు రాజపుత్రులు ప్రవేశించిన ఉత్తర ద్వారాన్ని శాశ్వతంగా మూయించి వేశాడు. దానిని ప్రజలు అమరసింగ్ రాథోడ్ దర్వాజా” అని చెప్పుకోసాగారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top