గోవా విముక్తి పోరాటం అనేది ఒక ఆరని జ్వాల - Detailed information About Goa Liberation in Telugu

megaminds
0

Goa Liberation in Telugu

1947 ఆగష్ట్ 15 న భారతదేశం, బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. కాని స్వతంత్ర భారతదేశంలో ఇంకా కొంత భాగం చాలా ఏళ్ళు విదేశీయుల పాలనలోనే వుంది. తీరప్రాంతమైన గోవా, పోర్చుగీస్ వారి ఆదీనంలోనే ఉండింది. దాదాపు స్వాతంత్ర్యం వచ్చిన 14 ఏళ్ళకు పోర్చుగీస్ నుండి గోవాకు విముక్తి లభించింది. సోషలిస్ట్ నాయకుడు రామ మనోహర్ లోహియా జూన్ 18 1946 న గోవా చేరుకుని పోర్చుగీస్ కి వ్యతిరేకంగా ఉద్యమించాడు. గోవా ప్రజలు వేల సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల పోరాటం తరువాత 1961 లో గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించింది.

గోవా విముక్తి పోరాటం అనేది ఒక ఆరని జ్వాల. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా అది వెలుగుతూనే వుంది. కుంకాలి సంగ్రామం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ నేతృత్వంలోని వీర మరాఠాల వరకు అందరూ గోవా కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. 1946 జూన్ 18న సోషలిస్ట్ నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గోవా స్వాతంత్ర్యం కోసం మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంటే గోవా విముక్తి పోరాటం చివరి దశను ప్రారంభించాడన్నమాట. లోహియా గోవా విప్లవాన్ని రగిల్చాడు. ఫలితంగా గోవా ప్రజలు భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం నుండి ప్రేరణ పొంది తమను తాము సంఘటితం చేసుకోవడం ప్రారంభించారు. గోవా విప్లవం కూడా అపూర్వమైన విప్లవ త్యాగాన్ని చూసింది. ఆజాద్ గోమంతక్ దళ్ అనే విప్లవ పార్టీ కూడా గోవాను పోర్చుగీస్ బారి నుండి విముక్తి చేయడానికి చురుగ్గా పనిచేసింది.

1946 జూన్ 18 తర్వాత 14 సంవత్సరాలకు అంటే 1961 డిసెంబర్ 18-19న విజయ్ సైనిక చర్య ద్వారా భారత ప్రభుత్వం గోవాను విముక్తి చేసింది. ఫలితంగా ఈ సంవత్సరం గోవా విముక్తి పోరాటం ప్రారంభమై 76వ వార్షికోత్సవం, గోవా స్వాతంత్ర్యం వచ్చి 61వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1946 నుంచి 1961 మధ్య కాలంలో పోర్చుగీస్ బానిసత్వం నుంచి గోవాను విడిపించేందుకు వేలాది మంది భారతీయులు తమ ప్రాణాలు అర్పించారు. ఎందరో ప్రజలు పోర్చుగీస్ జైళ్ళలొ హింసలు అనుభవించారు. గోవా స్వాతంత్య్ర పోరాటంలో అందరూ కలిసి పోరాడారు. గోవా విముక్తి కోసం జరిగిన పోరాటానికి భారతదేశం నలుమూలల నుంచి మద్దతు లభించింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోర్చుగీస్ అనేక మంది ఆందోళనకారులను, విప్లవకారులను అరెస్టు చేసి జైళ్ళో పెట్టింది. అయినప్పటికీ గోవాలో ఉద్యమం ఎప్పుడూ మందగించలేదు, గోవా జైళ్ళు సత్యాగ్రహులతో నిండిపోయాయి.

పోర్చుగీస్ వారు వీరిలో చాలా మందిని అరెస్ట్ చేసి సుదీర్ఘ జైలు శిక్ష విధించారు. వీరిలో కొందరిని ఆఫ్రికా దేశమైన అంగోలా జైలులో కూడా ఖైదు చేశారు. చాలా మంది యోధులు గోవా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కష్టాలను ఓర్చుకుని త్యాగాలు చేయడానికి పూనుకున్నారే తప్ప పోరాటాన్ని విడిచిపెట్టలేదు. గోవా స్వాతంత్య్ర పోరాటంలో, గోవా ముక్తి విమోచన సమితి సత్యాగ్రహంలో 31 మంది సత్యాగ్రహులు మరణించారు. చాలా మంది ఆజాద్ గోమంతక్ దళ నాయకులు, గోవా ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేశారు. ప్రభాకర్ త్రివిక్రమ్ వైద్య, విశ్వనాథ్ లవండే, జగన్నాథ్ రావ్ జోషి, నానా కబ్రేకర్, సుధీర్ ఫడ్కే వంటి అనేక పోరాట యోధులు గోవా, డామన్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆ ఉద్యమానికి ఊపిరిపోసి దిశానిర్దేశాన్ని అందించారు.

గోవా విముక్తి లో కీలక పాత్రపోషించారు మధు లిమయే: రామనోహర్ లోహియా శిష్యుడైన మధు లియాయే, గోవా స్వాతంత్ర్య పోరాటంలో 1955, 1957 మధ్య రెండేళ్ళ పాటు పోర్చుగల్లో జైలు శిక్ష అనుభవించారు. అక్కడ అతను చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ పోరాటాన్ని వదిలిపెట్టలేదు. గోవా విముక్తి కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. మధు లిమాయే 14-15 సంవత్సరాల వయసులో స్వాతంత్య్ర ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించాడు. 1944లో ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు విడుదలయ్యాడు. గోవా విముక్తి కోసం సత్యాగ్రహం ప్రారంభమైనప్పుడు, అతను తిరిగి జైలుకు వెళ్ళి పోర్చుగీస్ నుండి గోవాను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడంలో మధు లిమాయే ముఖ్య పాత్ర పోషించాడు. 1922 మే 1న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన మధు లిమాయే, జాతీయోధ్యమం, గోవా స్వాతంత్య్ర ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన ఆధునిక భారతదేశపు ప్రముఖ వ్యక్తులలో ఒకరు. మధు లిమాయే చిన్న వయసులోనే మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేశాడు. ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత అతను 1937లో పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో ఉన్నత విద్యలో చేరాడు. అక్కడ అతను విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నాడు. దానిని అనుసరించి జాతీయ ఉద్యమంలో చేరి, సోషలిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై, 1950లో గోవా లిబరేషన్ ఉద్యమంలో చేరాడు.

వలసవాదానికి వ్యతిరేకి అయిన మధు లిమాయే జూలై 1955లో పెద్ద సత్యాగ్రహానికి నాయకత్వం వహించి గోవాలోకి ప్రవేశించాడు. అక్కడ పోర్చుగీస్ పోలీసులు సత్యాగ్రహులపై దాడిచేశారు. పోర్చుగీస్ మిలిటరీ ట్రిబ్యునల్ అతనికి డిసెంబర్ 1955లో కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే గోవాలో తనను ఖైదు చేసినప్పుడు మధు లిమాయే వారికి వ్యతిరేకంగా వాదించడం కానీ, అపీల్ చేయడం కానీ చేయలేదు. గాంధీజీ నా జీవితాన్ని ఎంతగా మార్చారో నేను గ్రహించాను. ఆయన ఆలోచనలు నా వ్యక్తిత్వం, సంకల్ప శక్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, అని మాత్రం రాశారు. పోర్చుగీస్ నిర్భందం నుండి విడుదలైన తర్వాత కూడా మధు లిమాయే గోవా విముక్తి కోసం ప్రజలను సమీకరించడం కొనసాగించాడు. వివిధ సమూహాల నుండి మద్దతు అభ్యర్థించాడు. ఈ విషయంలో ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత ప్రభుత్వం గోవాలో సైనికంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. దాంతో రాష్ట్రం పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందింది.

గోవా విముక్తి ఉద్యమ సమయంలో మధు లిమాయే 19 నెలలకు పైగా పోర్చుగీస్ చేతిలో బందీగా ఉన్నాడు. అతని నిర్బంధ సమయంలో అతను జైళ్ళో డైరీ రాశాడు. దాన్ని అతని భార్య చంపా లిమాయే 1996లో గోవా లిబరేషన్ మూవ్మెంట్ మధు లిమాయే పేరుతో ప్రచురించారు.

14 ఏళ్ళు పోర్చుగల్ జైలులో గడిపిన యోధుడు మోహన్ రనాడే: గోవా విముక్తి ఉద్యమంలో భాగంగా, గోవా విముక్తి ఉద్యమ నాయకుడు మోహన్ రనాడే బెటిమ్, బానారిమ్ ఇతర పోలీస్ అవుట్ పోస్టులపై దాడి చేశారు. ఫలితంగా 1955లో ఆయన్ని పోర్చుగీస్ పోలీసులు అరెస్ట్ చేసి పోర్చుగల్ లోని లిస్బన్ సమీపంలోని కాక్సియాస్ కోటలో బంధించారు. 1961లో గోవా విముక్తి పొందిన తర్వాత కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు. దాదాపు 14 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 1969 జనవరిలో విడుదల చేయడానికి ముందు పోర్చుగీస్ అతన్ని ఆరు సంవత్సరాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారు. స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాద సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రభావంతో పోర్చుగీస్ పాలన నుండి గోవాను విముక్తి చేసేందుకు మోహన్ రానడే ఆజాద్ గోమంతక్ దళ్లో చేరారు. నిజానికి సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో విజయం సాధించలేమని గోవా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారు గ్రహించారు.

అటువంటి పరిస్థితుల్లో వారు భిన్నమైన చర్యను ఎంచుకున్నారు. ఇందులో రనడే కూడా పాల్గొన్నారు. దీని తర్వాత అతను పోర్చుగీస్ వలస పాలనకు వ్యతిరేకంగా రహస్య ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 1950వ దశకం ప్రారంభంలో మరాఠీ ఉపాధ్యాయుడిగా రనడే గోవాకు వచ్చారు. అతను పోర్చుగీస్ పోలీస్ స్టేషన్లపై సాయుధ దాడులకు పాల్పడ్డారు. అతని చివరి దాడి 1955 అక్టోబర్లో బేటిమ్లో జరిగింది. మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన రనడే, తను చేసిన దాడిలో ఊపిరితిత్తులకు గుండు తగిలి పట్టుబడ్డాడు. ఈ దాడి జరిపినందుకు అతనికి 26 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అందులో అతను 6 సంవత్సరాలు ఏకాంత నిర్బంధంలో ఉండవలసి ఉంది. రనడేని జైలు నుంచి విడుదల చేయాలని చాలా మంది ఉద్యమించారు. పలువురు జాతీయ నాయకులు అతని విడుదలను డిమాండ్ చేసినా లాభం లేకపోయింది.

14 సంవత్సరాల తర్వాత చివరకు పోప్ జోక్యంతో జనవరి 25, 1969న విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత రనడే పూణేకు మకాం మార్చారు. అయినా అతను ప్రతి సంవత్సరం రెండు సార్లు గోవా వెళ్లేవారు. ఒకటి జూన్ 18న క్రాంతి దివన్నాడు, మరొకటి డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం నాడు. మోహన్ రనడే 2001లో పద్మశ్రీ అవార్డు, 2006లో సాంగ్లీ భూషణ్ అవార్డు అందుకున్నారు. 1986లో సామాజిక సేవకు గానూ గోవా అవార్డు అందుకున్నారు. రనడే గోవా లిబరేషన్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ప్రచురించారు. రనడే భయం ఎరగని స్వాతంత్య్ర సమరయోధుడు. గోవా ఉద్యమం కోసం అతను చేసిన పోరాటాలు, త్యాగాలు మరపురానివి.


నిజమైన కొంకణి హీరో పురుషోత్తమ్ కకోద్కర్: స్వాతంత్య్ర చరిత్రలో, గోవా విముక్తి ఉద్యమంలో పురుషోత్తమ్ కకోద్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన అండర్ గ్రౌండ్ కార్యకకలాపాలకు నాయకత్వం వహించారు. మహాత్మాగాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు కాకోద్కర్ జైలు పాలయ్యాడు. అతను గాంధేయ స్వాతంత్ర్య సమరయోధుడు. సామాజిక కార్యకర్త . నిజమైన కొంకణి వీరుడు. అతను వార్ధాలోని గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో కూడా నివసించాడు. గాంధీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అతి కొద్ది మంది గోవా వాసులలో ఈయన ఒకరు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 1946లో గోవాలో గోవా విమోచన ఉద్యమాన్ని స్థాపించినప్పుడు అందులో చేరి జైలుకెళ్ళారు. 1943లో గోవా స్వాతంత్ర్యానికి మద్దతునిచ్చే కొందరు మద్దతుదారులతో కలిసి కకోద్కర్ గోవా సేవా సంఘాన్ని స్థాపించారు. దీని ద్వారా అతను గోవాలో కొత్త స్ఫూర్తిని నెలకొల్పి విముక్తి పోరాటానికి ప్రజల్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు.

1946 జూన్ లో పురుషోత్తం కకోద్కర్, వసంత్ కరేతో కలిసి మొదటిసారిగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియాను అస్సోల్నాలోని జూలియావో మెనెజెస్ ఇంట్లో కలిశారు. జూన్ 18న జరిగిన ఈ సమావేశం గోవా పౌర హక్కుల పోరాటానికి బీజం వేసింది. గోవా స్వాతంత్ర్యానికి సంబంధించి అతని హైపర్ యాక్టివిటీ కారణంగా పోర్చుగీస్ పోలీసులు ఆయన్ని 1946 ఆగస్ట్ 9న అరెస్ట్ చేశారు. 1946 సెప్టెంబర్ 27న అతన్ని కోర్టు మార్షల్ చేసింది. భౌ అని ముద్దుగా పిలుచుకునే పురుషోత్తం కకోద్కర్ను పోర్చుగల్కు బహిష్కరించారు.

1956లో అతను పోర్చుగీస్ జైలు నుండి విడుదలయ్యాడు. అంతేకాదు, గోవాను మహారాష్ట్రలో కలపాలని భావించిన తరుణంలో ఆయన అభిప్రాయ సేకరణకు తెరలేపడం కూడా గోవాపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఆయన కారణంగా 1967లో గోవా విలీనాన్ని అడ్డుకుంటూ కేంద్రం అభిప్రాయ సేకరణ చేయవలసి వచ్చింది. పురుషోత్తం కకోద్కర్ 1984లో గోవా కొంకణి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. కకోద్కర్ మే 2, 1998న ముంబైలో మరణించారు.

గోవా స్వాతంత్య్రంకోసం అసువులుబాసిన మొదటి త్యాగధనుడు బాలా రాయ మపారి: గోవా స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ బాలా రాయ మపారి ఆజాద్ గోమంతక్ దల్ సంస్థలో సభ్యునిగా పని చేశారు. పోర్చుగీసుల చేతిలోనుంచి గోవా స్వాతంత్య్రంకోసం అలుపెరగని పోరాటం ఏశారు.

గోవా స్వాతంత్ర్యం పోరాటంలో అసువులుబాసిన మొదటి త్యాగధనునిగా ఆయన పేరు సంపాదించుకుననారు. మపారీ, గోవాలోని బరైజ్ తాలూకా అసోనోరాలో జన్మించారు. పోర్చుగీసువారి కబంధ హస్తాలనుంచి గోవాకు విముక్తి కల్పించడానికిగాను ప్రారంభమైన విప్లవ సంస్థ ఆజాద్ గోమంతక్ దల్ లో ఆయన క్రియాశీల సభ్యునిగా పని చేశారు. ఒక సారి విప్లవకారులు అసోనోరాల పోలీస్ స్టేషన్ పై దాడి. చేసి పోలీసులను కిడ్నాప్ చేసి, వారి ఆయుధాలను మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ పై జరిగిన ఈ దాడిలో బాలా రాయ మపారీ కీలక పాత్ర పోషించారనే విషయానని పోర్చుగీసు పోలీసులు పసిగట్టారు. ఆయన్ను పోర్చుగీసు పోలీసులు 1955లో అరెస్టు చేశారు. ఆయన్ను పోలీసులు తీవ్రంగా హింసించారు. పోలీసులు ఎంత కఠినంగా హింసించినా మపారీ నోరు విప్పలేదు. విప్లవకారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులకు తెలియజేయలేదు. దాంతో పోలీసులు ఆయన్ను మరింత తీవ్రంగా హింసించారు. దాంతో ఆయన ఫిబ్రవరి 15, 1955లో ప్రాణాలు కోల్పోయారు.

గోవా స్వాతంత్ర్యపోరాటంలో 68 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమర జీవులుగా నిలిచారు. అలా ప్రాణత్యాగం చేసినవారిలో మాయా మాయా రాయ మపారీ మొదటివారిగా గుర్తింపు పొందారు. పిన్న వయస్సులోనే ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇప్పటికీ గోవా స్వాతంత్య్ర పోరాట చరిత్రను తలుచుకున్నప్పుడల్లా ఆయన పేరును ఎంతో గర్వంగా తలుచుకోవడం జరుగుతోంది.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top