అలుపెరుగని ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు - Detailed Information about Azad Hind Fauj In Telugu

megaminds
0
"నాతో కలసి ప్రాణత్యాగానికి సిద్ధం కండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను!" అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం స్వాతంత్య్రం కోసం పోరాటంపై ప్రతి భారతీయుడి హృదయంలో సరికొత్త ఉత్సాహ, ఉద్వేగాలను నింపింది. భారత స్వాతంత్య్ర పోరాటంలోని ప్రముఖులలో బోస్ కూడా ఒకరు. ఆయన నాయకత్వంలో 'ఆజాద్ హింద్ ఫౌజ్' శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి పెనుసవాలు విసిరింది. ఈ క్రమంలో నేతాజీ 'ఆజాద్ హింద్' ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి గల చారిత్రక ప్రాముఖ్యం దృష్ట్యా స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని 2018లో ప్రధాన నరేంద్ర మోదీ ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే 2021 జనవరి 23న నేతాజీ 125వ జయంతి నేపథ్యంలో ఆ సందర్భాన్ని స్మరించుకునే దిశగా కేంద్రప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలకు శ్రీకారం. చుట్టింది. అంతేకాకుండా ఆయన జయంతి అయిన జనవరి 23ను 'పరాక్రమ్ దినోత్సవం' గా నిర్వహించుకోవాలని నిర్ణయించింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిశాలోని కటక్ లో 1897 జనవరి 23న జన్మించారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేయడమేగాక ప్రగతికి బలమైన పునాది వేయడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని ఆకాంక్షించిన దార్శనిక నేత. పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులు, శాస్త్రీయ దృక్పథం లేకపోవడం వంటి వాటిని ప్రగతికి అతి పెద్ద అవరోధాలుగా ఆయన పరిగణించారు. అందుకే ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వం ప్రతి రంగానికి పునరుత్తేజం ఇవ్వాలని ఆకాంక్షించింది. ఆ మేరకు తనదైన బ్యాంకు, కరెన్సీ నుంచి రేడియో స్టేషన్ ఏర్పాటుదాకా ప్రతి రంగంలోనూ ఆజాద్ హింద్ ప్రభుత్వం తనదైన ముద్రను అద్భుతంగా చాటుకుంది.

కుల, మత, వర్ణ, భాషా, ప్రాంతీయ అడ్డుగోడలను బద్దలు కొట్టి దేశాన్ని ఏకం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జాతీయ ఐక్యతపై ఆయన దార్శనికతను వెల్లడించే ఉదంతం ఒకటి ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు సైనికాధికారులు కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్, జనరల్ షానవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ పై సైనిక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కల్నల్ ధిల్లాన్ తరఫున వాదించేందుకు అకాలీదళ్ ముందుకొచ్చింది. అలాగే జనరల్ షానవాజ్ ఖాన్ కు వకాల్తాగా ముస్లింలీగ్ సిద్ధమైంది. అయితే ఈ సైనికాధికారులు సదరు ప్రతిపాదనలను తిరస్కరించారు. ఆ సమయంలో ఒక నినాదం అత్యంత వేగంగా ప్రజల్లోకి దూసుకుపోయింది. 'ఎర్రకోట నుంచి దూసుకొచ్చిన ఆ నినాదం సెహగల్, థిల్లాన్, షానవాజ్ ల గళాలనుంచి వెలువడింది.' అదే. "జైహింద్"...

గాంధీజీ నుంచి 'నేతాజీ' బిరుదు పొందిన సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ఈ నినాదమే ఇవాళ మన జాతీయ నినాదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ కు సన్నిహితులైన కెప్టెన్ అబ్బాస్ అలీ, రాస్ బిహారీ బోస్, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్, కల్నల్ నిజాముద్దీన్ సహా 'ఆజాద్ హింద్ ఫౌజ్' సైనికుల జీవితాలను మనం పరిశీలిద్దాం. వారు బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై అలుపెరుగక పోరాడటమే కాకుండా నేతాజీ పిలుపుతో భరతమాత కోసం సర్వస్వం త్యాగం చేశారు.



బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన యోధుడు కెప్టెన్ అబ్బాస్ అలీ: కెప్టెన్ అబ్బాస్ అలీ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా ఖుర్జాలో 1920 జనవరి 3న ముస్లిం రాజ్ పుత్ కుటుంబంలో జన్మించారు. వారిది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఆయన తాత రుస్తమ్ అలీఖాన్ ను ఉత్తరప్రదేశ్లోని బులందోహర్లో ఉరితీశారు.

ఇక బ్రిటిష్ పాలకులు 1931 మార్చి 23న షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ ను ఉరితీసినప్పుడు అబ్బాస్ అలీ వయసు కేవలం 11 సంవత్సరాలు. అయినప్పటికీ, ఆయన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొనడం కొనసాగించారు. అలాగే భగత్ సింగ్, ఆయన సహచరులు స్థాపించిన 'నౌజవాన్ భారత్ సభ' లో సభ్యుడుగా చేరారు. అటుపైన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుతున్నపుడు 'అఖిల భారత విద్యార్థి సమాఖ్య' (ఎఐఎస్)లో సభ్యుడయ్యారు. చదువు పూర్తయ్యాక తిరుగుబాటుకు నాంది పలికే లక్ష్యంతో 1939 లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. బ్రిటిష్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసరుగా పనిచేస్తున్న కెప్టెన్ అబ్బాస్ అలీని జపాన్తో పోరాటంలో భాగంగా ప్రభుత్వం 1940లో ఆగ్నేయాసియా యుద్ధరంగానికి పంపింది.

అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1944లో సింగపూర్ నుంచి సాయుధ విప్లవానికి నాయకత్వం వహించినప్పుడు కెప్టెన్ అబ్బాస్ అలీ బ్రిటిష్ ఆర్మీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో చేరారు. అనంతరం మయన్మార్ లోని ప్రస్తుత రాజైన్ ప్రావిన్స్ పరిధిలోగల అరకాన్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడారు. కానీ జపనీయులు మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోవడంతో అబ్బాస్ అలీ సహా 60 వేల మందికి పైగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయనతోపాటు ముగ్గురు సహచరులను ముల్తాన్ కోటలో నిర్బంధించి విచారణ చేపట్టారు. చివరకు అబ్బాస్ అలీపై సైనిక న్యాయస్థానంలో విచారణ అనంతరం 1946లో మరణశిక్ష విధించబడింది.

మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి ఆయన సిద్ధమైనప్పటికీ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో కారాగారం నుంచి విడుదలయ్యారు. స్వతంత్ర భారతంలో ఆయన సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు భారత నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించారు.



ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు రాస్ బిహార్ బోస్: నేతాజీ దేశం విడిచి జర్మనీ వెళ్లిన సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పగ్గాలను ఆయనకు అప్పగించాలని రాస్ బిహార్ బోన్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు నేతాజీని ఆయన టోక్యో రావాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 జూన్ 20న టోక్యో వెళ్లారు. సుభాష్ చంద్ర బోస్ ప్రత్యక్షంగా కలుసుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు రాస్ బిహారి బోస్ తమ రహస్యం సంభాషణను బెంగాలీ భాషలో నడిపించారు. ఈ సందర్భంగా దేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేస్తామని వారు ప్రతిన బూనారు.

ఈ ఇద్దరు నాయకులూ బెంగాలీలు... విప్లవ మూర్తులు కావడంతోపాటు వీరిద్దరి మధ్య ఇంటి పేరు సహా అనేక సారూప్యాలు ఉండటం విశేషం. రాస్ బిహారి బోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకత్వ బాధ్యతలను జూలై 5న నేతాజీకి అప్పగించి, తాను సలహాదారు పాత్రకు పరిమితమయ్యారు. కాగా, రాస్ బిహార్ బోస్ 1886 మే 25న బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా సుభాల్దా గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే విప్లవ కార్యకలాపాల పట్ల ఆకర్షితులై అతి చిన్న వయసులోనే నాటు బాంబుల తయారీ నేర్చుకున్నారు. బంకిం చంద్రుని 'ఆనంద్ మఠ్' నవల ఆయనలో విప్లవ జ్వాలను రగిల్చింది. దీంతోపాటు స్వామి వివేకానంద సురేంద్రనాథ్ బెనర్జీల జాతీయవాద ప్రసంగాలతోనూ ఆయన ఎంతగానో ప్రభావితమయ్యారు.

కాగా, ముజఫర్పూర్ మేజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ చంపడానికి ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ ఉపయోగించిన బాంబును రాస్ బిహారీ బోస్ తయారు చేసినట్లు చెబుతారు. అలాగే 1912లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ను హతమార్చడానికీ ప్రణాళిక రచించినా ఈ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారు. ఆ తర్వాత గదర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడటంతో దానిబారి నుంచి తప్పించుకుని జపాన్ వెళ్లి, భారతదేశానికి సహకరించేలా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆ తర్వాత జపాన్ యువతిని వివాహమాడారు. అప్పట్లో జపాన్ తమ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్': ప్రధానం ద్వారా ఆయనను సత్కరించింది. మాతృభూమి కోసం ఆయన చేసిన అవిరళ కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.



పవిత్రాశయ సాధనలో గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ వెన్నంటి నడిచిన దేశం: గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ చదువులో ప్రజ్ఞాశాలి, భారీకాయుడు కావడంతో సైన్యంలో చేరాల్సిందిగా ఆయన తండ్రి స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ మేరకు ఆయన తదనుగుణంగా సన్నద్దమై 1933లో ఇండియన్ ఆర్మీ లో చేరాడు. ఆ విధంగా 14వ పంజాబ్ రెజిమెంట్ కు ఎంపికై, శిక్షణ పొందిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడేందుకు 1941లో మలేషియా వెళ్లాల్చి వచ్చింది. ఆ తర్వాత 1942లో జపాన్ సైన్యం యుద్ధఖైదీగా నిర్బంధించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అక్కడ జైలులో ఉన్న సమయంలో ఆయన మనసు మార్చుకుని మాతృభూమి కోసం బ్రిటిష్ సైన్యంతో పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో జైలునుంచి విడుదలైన తర్వాత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. బ్రిటిష్ వారితో తలపడటంలో ధిల్లాన్ అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు.

అయితే, 1945లో జపాన్ లొంగిపోయిన సమయంలో గురుబక్ష్ సహా అనేకమంది అజాద్ హింద్ ఫౌజ్ సైనికులు అరెస్టయ్యారు. వారందరినీ బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి చారిత్రక 'ఎర్రకోట విచారణ'. పేరిట వారిపై విచారణ చేపట్టింది. దేశంలోని ఉద్దండులైన ఎందరో న్యాయవాదులు ముందుకొచ్చి థిల్లాన్ తరఫున గట్టిగా వాదనలు వినిపించారు. మరోవైపు ఆయనపై బ్రిటిష్ పాలకుల విచారణమీద ప్రజాగ్రహం పెల్లుబికింది. అజాద్ హింద్ ఫౌజ్ సైనికులను రక్షించే ఉద్యమంలో భాగంగా ప్రతి మతం, ప్రతి రంగంలోని ప్రజలంతా భాగస్వాములు కావడంతో భారతదేశాన్ని ఏకీకృతం చేయాలన్న నేతాజీ దార్శనికత వాస్తవ రూపం దాల్చింది. ఆ మేరకు ఎర్రకోట వెలుపల మూకుమ్మడి ప్రజా నిరసనకు దేశవాసులంతా మద్దతు పలికారు. దీంతో విధిలేక గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయక తప్పలేదు. ఈ విచారణ తంతు 1945 నవంబర్ 5 నుంచి 1945 డిసెంబర్ 31 వరకు 57 రోజులపాటు సాగింది. భారత స్వాతంత్య్ర పోరాటం చరిత్రలో ఈ విచారణ ఓ కీలక మలుపుగా నిలిచింది. భారతదేశాన్ని ఏకం చేయడంలో ఈ ఉదంతం ఎంతో ప్రేరణనిచ్చింది. కాగా, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ జాతికి చేసిన సేవలకుగాను 1998లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది.



నేతాజీ డ్రైవర్, అంగరక్షకుడు కల్నల్ నిజాముద్దీన్: నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 మే 9వ తేదీన ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఆ వేదికపైగల ఒక వ్యక్తి పాదాలకు నమస్కరించారు. ఆయన మరెవరో కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడైన కల్నల్ నిజాముద్దీన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారు డ్రైవరుగా ఉండే ఈయన తుపాకీ పేల్చడంతో గొప్ప గురిగలవారే కాకుండా 11 భాషలలో నైపుణ్యంగలవారని భావిస్తారు.

యుద్ధరంగంలో ఒక బ్రిటిష్ యుద్ధవిమానాన్ని ఆయన కూల్చేశారని చెబుతారు. కాగా, సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక నియామకాలు నిర్వహిస్తున్నపుడు ఆయన తొలిసారి నేతాజీని కలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ జిల్లా ధక్వా గ్రామంలో జన్మించిన నిజాముద్దిన్ కు సుభాష్ చంద్రబోస్ కల్నల్ హోదా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రాజ్యశ్రీ చౌదరి 2015లో అజంగఢ్ కు వెళ్లి నిజాముద్దీన్ ను కలుసుకోవడాన్ని బట్టి, నేతాజీతో ఆయనకుగల బంధం ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు.

కాగా, ఆయన తొలుత బ్రిటిష్ ఆర్మీలో పారాట్రూపర్గా పనిచేసేవారని, ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కలిసిపోయేందుకు ఆనాటి మద్రాసు, కాశ్మీరు సహచరులతో కలసి వెళ్లిపోయారని చెబుతారు. ఒక సందర్భంలో తన వెన్నులో మూడు బుల్లెట్లు దిగబడినా సుభాష్ చంద్రబోస్ ని రక్షించగలిగానని, డాక్టర్ లక్ష్మీ సెహగల్ ఆ బుల్లెట్లను బయటకు తీశారని కల్నల్ నిజాముద్దీన్ గుర్తు చేసుకుంటూండేవారు.

నిజాముద్దీన్ 2017లో అజంగఢ్ పరిధిలోని ముబారక్ పూర్లో కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ నిజాముద్దీన్ ను తాను కలుసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. గుండెలనిండా దేశభక్తి, ఆదర్శాలు, అకుంఠిత ధైర్యసాహసాలకు ఆయన మారుపేరని, ఆయనలోని ఈ లక్షణాలు స్వాతంత్ర్యోద్యమాన్ని బలోపేతం చేశాయని ప్రధాని కొనియాడారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top