గురువు - గురు పౌర్ణమి విశిష్టత - Importance of Guru Pournami In Telugu

megaminds
0
గురువు: అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు. జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.

గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం. గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మంగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన మనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.

అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించ లేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.

ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికీ లభించనంతటి, ఆయన ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.

కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురు పుత్రుని సజీవుని చేసి తీసుకువచ్చి గరువుగారి ఋణం తీర్చుకున్నాడు. మంచి గురుశిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరి పడా పడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్వడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలునుకునే ప్రయత్నం చేయడం.

వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది.  మన లోనే విజ్ఞానముంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికీ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయ భూతుడిగా, సలహా దారుడిగా ఉంటాడు గురువు.

వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజా కవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురు కులానికి వెళ్లి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు.

గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు.. అని విశ్వ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అన్నారు. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహధ్యాయిల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.

మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా, ఎక్కు వగా చూసేది తల్లి కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు బోధనలు చేసే బోధ గురువులు వంటి వారందరూ వస్తారు... -తాడేపల్లి హనుమత్ ప్రసాద్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

megaminds

Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top