Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సెల్యులార్ జైల్లో బ్రిటిషర్ల అరాచకాలకు బలైన స్వాతంత్ర్యపోరాట యోధుడు మహావీర్ సింగ్ - About Mahavir Singh in Telugu

నా మూహ్ చిపాకే జియే ఔర్ నా సిర్ ఝుకాకే జియే, సితమ్‌గరోంకీ నజర్ సే నజర్ మిలాకే జియే బస్ ఏక్ రాత్ అగర్ కమ్ జియేతో హైరాట్ క్యూ, కే హమ్ జహామే మష...




నా మూహ్ చిపాకే జియే ఔర్ నా సిర్ ఝుకాకే జియే,
సితమ్‌గరోంకీ నజర్ సే నజర్ మిలాకే జియే
బస్ ఏక్ రాత్ అగర్ కమ్ జియేతో హైరాట్ క్యూ,
కే హమ్ జహామే మషాలే జలా జలాకే జియే

అంటే.. ‘నోరు మూసుకుని, తల దించుకుని జీవించాల్సిన అవసరం లేదు. మనల్ని అణచివేయాలనుకుంటున్న వారి కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూ బతుకుదాం. ఒకరాత్రి తక్కువ బతికితే ఏమవుతుంది. మన కాగడాల్లో మంటలు ఎప్పటికీ మండుతూనే ఉండేలా చూసుకుందాం’

సెల్యులార్ జైల్లో చిత్రహింసలు అనుభవించిన భారతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర్య విప్లవ మార్గ వీరుడు మహవీర్ సింగ్.. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో తరచుగా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పాటలను పాడేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత అమానవీయమైన, అరాచకమైన శిక్షలకు అండమాన్ సెల్యులార్ జైలు సాక్షిగా నిలిచింది. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత, విప్లవ పోరాటయోధులను ఒక్కరొక్కరిని అరెస్టు చేసి, వారిని చిత్రహింసలు పెట్టాలని నిర్ణయించింది. తద్వారా వారిని, వారి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారిని భయపెట్టాలన్న ఉద్దేశంతో నలువైపులా సముద్రం ఉండి.. తప్పించుకునే వీలులేని అండమాన్‌ను జైలుగా మార్చి, బ్రిటీష్ ప్రభుత్వం అమానవీయ శిక్షలకు వేదికగా మార్చింది. జీవించేందుకు అత్యంత దుర్భరమైన వాతావరణ పరిస్థితులుండే అండమాన్ ద్వీపానికి ఈ విప్లవ పోరాటయోధులను చేర్చి, చేతులకు బేడీలు వేసి, గొలుసులతో బంధించి కఠినాతికఠినమైన శిక్షలను విధించేవారు. ప్రఖ్యాతి పొందిన విప్లవ మార్గ స్వాతంత్ర్య సమరయోధులను కూడా అత్యంత దారుణంగా శిక్షించేవారు.

రాజకీయ ఖైదీలకు సెల్యులార్ జైలులో చూపించిన నరకం గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలాపానీ గురించి అక్కడి శిక్షల గురించి ఆలోచించిన ప్రతిసారీ మన స్వాతంత్ర్య పోరాటయోధులు అనుభవించిన మానసిక, శారీరక క్షోభను తలచుకుని చాలా బాధ కలుగుతుంది. బ్రిటీష్ వారి దృష్టిలో స్వాతంత్ర్య పోరాట యోధులు చేసిన తప్పల్లా, భారతమాతను దాస్యశృంఖలాలనుంచి విముక్తురాలిని చేయాలన్న ఏకైక సంకల్పంతో పనిచేయడమే.

1904లో ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ గ్రామంలో కున్వర్ దేవీసింగ్, శ్రీమతి శారదా దేవి దంపతులకు మహవీర్ సింగ్ జన్మించారు. బాల్యం నుంచే స్వాతంత్ర్య భావాలున్న మహవీర్ సింగ్, కౌమార దశలోకి వచ్చేసరికే వివిధ స్వాతంత్ర్య పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాలేజీలోకి వచ్చేసరికి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ సంస్థలో కీలక సభ్యుడయ్యారు. విప్లవవీరుడు భగత్‌సింగ్‌కు మహవీర్ సింగ్ అత్యంత సన్నిహితుడు. లాహోర్ లోని మోజాంగ్ హౌజ్‌ నుంచి భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్, దుర్గా భాభి తప్పించుకోవడంలో మహవీర్ సింగ్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.

1929లో లాహోర్ కేసులో మహవీర్ సింగ్‌ను బ్రిటిషర్లు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను అండమాన్ లోని కాలాపానీ జైలుకు తరలించారు. ఈ జైలు ఖైదీలకు ఓ ప్రత్యక్ష నరకంగా మారింది. మరీ ముఖ్యంగా రాజకీయ ఖైదీల విషయంలో బ్రిటిషర్లు ప్రవర్తించే తీరు అత్యంత అమానవీయంగా ఉండేది. అసాధ్యమైన పనులను చేయలేనంత సమయంలో చేయాలంటూ హుకుం జారీచేసేవారు. ఒకవేళ ఆ పనిని వారు చెప్పినట్లు, నిర్దిష్ట సమయంలో చేయలేకపోతే, చిత్రహింసలు పెట్టేవారు. ఇసుకబట్టీల్లో పనిచేయించడం, కొబ్బరి నార తీయించి వాటితో తాళ్లు నేయించడం, పశువులకు బదులుగా ఖైదీలను గానుగకు కట్టి నూనె తీయించడం వంటి ఎన్నో చిత్రహింసలు పెట్టేవారు. గానుగకు కట్టి నూనె తీయించడం అనేది కాలాపానీ జైలులోని అత్యంత కఠినమైన శిక్షగా ఉండేది. అనుకున్న సమయంలో వాళ్లు నిర్దేశించినంత నూనె తీయని పక్షంలో శారీరకంగా, మానసికంగా హింసించేవారు. కాళ్లకు, చేతులకు బేడీలు వేసి నిలబెట్టేవారు, ఉక్కపోత వాతావరణంలో జనపనార దుస్తులను ధరింపజేసి పనులు చేయించేవారు.

ఇంత చేస్తున్నా కడుపునిండా తిండిపెట్టేవారు కాదు. కనీస పౌష్టికాహారాన్ని కూడా ఇచ్చేవారు కాదు. తోటి ఖైదీలతో మాట్లాడితే అదో పెద్ద నేరంగా భావించేవారు. ఇలాంటి పరిస్థితులతో చాలా మంది అనారోగ్యం బారిన పడేవారు. క్షయ, ఉబ్బసం, డయేరియాతోపాట కీళ్లనొప్పులతో బాధపడేవారు. మరికొందరు మానసికంగా కుంగిపోయేవారు. మన స్వాతంత్ర్య సమరయోధులను మాత్రమే ఈ స్థాయిలో చిత్రహింసలు పెట్టేవారు.

దీంతో జైల్లో కనీస వసతులు కల్పించాలని, చిత్రహింసలు తగ్గించాలన్న డిమాండ్లతో ఖైదీలుగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు ఆందోళనలు చేపట్టేవారు. 1933 మే నెలలో మహావీర్‌ సింగ్ తోపాటు 33 మంది నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ హఠాత్పరిణామంతో దిక్కుతోచని బ్రిటిషర్లు ఈ దీక్షను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వారిని వేర్వేరు గదుల్లో గొలుసులతో బంధించారు. జైలు వైద్యులు కూడా ఇలాంటి దీక్షలను ఎప్పుడూ చూడలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నిశ్చేష్టులైపోయారు. అయితే సీనియర్ వైద్యుల సూచనలతో నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీల గొంతు, ముక్కులోకి బలవంతంగా రబ్బరు గొట్టాలను జొప్పించి వాటి ద్వారా ఆహారాన్ని పంపించాలని నిర్ణయించారు. సాధారణంగా రోజులు, వారాల తరబడి దీక్ష చేస్తున్న వారు బలహీనులైనప్పుడు మాత్రమే ఈ పద్ధతిలో ఆహారాన్ని అందించేవారు. కానీ కాలాపానీ జైలులో మాత్రం ఐదో, ఆరో రోజునే ఇలాంటి పద్ధతిని అవలంబించేవారు. దీనికి ఖైదీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేది.

మహావీర్‌ సింగ్ కు కూడా ఇలాగే బలవంతంగా శిక్షను విధించినపుడు ఎదురైన ప్రతిఘటన, ఈ ప్రయత్నంలో ఆయన అమరుడైన పరిస్థితులను బిజోయ్ కుమార్ సిన్హా అనే మరో విప్లవవీరుడు తన ఆత్మకథలో స్పష్టంగా వివరించారు. గొంతులోకి రబ్బరు గొట్టాన్ని పంపించే ప్రయత్నాన్ని మహవీర్ తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ప్రయత్నంలో వైద్యులు మొండిగా వ్యవహరించడంతో ఆ రబ్బరు గొట్టం కాస్త ఆహార నాళికకు బదులుగా శ్వాస నాళంలోకి వెళ్లింది. అంతా బాగుందనుకుని ఆ గొట్టం ద్వారా వైద్యులు పాలు పంపించారు. దీంతో ఆ పాలతో ఊపిరితిత్తులు నిండిపోయాయి. దీంతో ఊపిరాడక మహవీర్ సింగ్ పల్స్ పడిపోవడం ప్రారంభమైంది. కాసేపటికే ఆయన స్పృహకోల్పోయారు. ఏదో తేడా జరిగిందని గుర్తించిన వైద్యులు ఆయన్ను వెంటనే జైలు ఆసుపత్రికి తరలించారు. మహవీర్‌కు ఏమైందంటూ దీక్ష చేస్తున్నవారు, తోటి ఖైదీలు అడిగినా వైద్యుల నుంచి సమాధానం రాలేదు. మహవీర్ సింగ్‌ను తోటి ఖైదీలు చూడటం అదే చివరిసారి. తమ తోటి వాడు, జైలులో కనీస వసతులు కల్పించాలంటూ నిరంతరం పోరాడే వ్యక్తి, భారతమాత స్వాతంత్ర్యాన్ని కళ్లారా చూడాలనుకునే వాడు, అందరికీ ఆత్మీయుడైన మహవీర్‌కు ఇకలేడన్న వార్తతో ఖైదీలందరూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.

‘మహవీర్ సింగ్ పార్థివదేహాన్ని పెద్ద బండలకు కట్టి ఎవరూ చూడకుండా తెల్లవారుజామున సముద్రంలో పడేశారన్న విషయం దీక్ష విరమణ జరిగిన తర్వాతే మాకు తెలిసింది. భారతమాత ముద్దుబిడ్డకు కనీస గౌరవం కల్పించకుండా, సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరపకుండా, సముద్రంలో చేపలకు ఆహారంగా పడేయడం కన్నా దారుణం, అవమానం ఇంకేమైనా ఉంటుందా. ఇదే మన దేశంలో అయితే.. ఇలాంటి యోధుడి పార్థివదేహానికి ఎంతటి గౌరవాన్నిస్తాం. దేశ సేవలో ఓ విప్లవ వీరుడు అమరుడయ్యాడు’ అని బిజోయ్ కుమార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

అండమాన్ జైలును సందర్శించినపుడు అక్కడ మహవీర్ సింగ్ విగ్రహం మనకు కనిపిస్తుంది. ఓ శూరుడి సాహసోపేతమైన, బాధాకరమైన గాథను ఈ విగ్రహం మనకు గుర్తుచేస్తుంది. మన విప్లవయోధులు అనుభవించిన చిత్రహింసలకు ఆ జైలు సజీవ సాక్షంగా నిలిచింది. జైలు ప్రాంగణంలో నడుస్తున్నప్పుడు, ఖైదీలను చిత్రహింసలు పెట్టిన పరికరాలను, గొలుసులను, బేడీలను, భీతిగొల్పే జైలు గదులను, ఖైదీలను కట్టి నూనె తీసిన గానుగలను, వారిని ఉరితీసిన కంబాలను చూడవచ్చు. మాతృభూమికి స్వాతంత్ర్యం అందించేందుకు ఎంతటి దారుణమైన శిక్షలను వారు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.

వినాయక్ దామోదర్ సావర్కర్, బటుకేశ్వర్ దత్, బరీంద్రఘోష్, భాయ్ పరమానంద్, సోహన్ సింగ్ బాఖ్నా, పృథ్వీసింగ్ ఆజాద్, సచీంద్ర సన్యాల్, బిజోయ్ కుమార్ సిన్హా వంటి ఎందరో వీరులు భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చాలనే ఏకైక లక్ష్యంతో అండమాన్ జైలులో శారీరక, మానసిక శిక్షలను కూడా ఆనందంతో స్వీకరించారు. బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర్య పోరాట కార్యక్రమాల్లో పాల్గొనకుండా వీరిని జైలులో ఉంచినా, భరతమాత ముద్దుబిడ్డల స్వాతంత్ర్యకాంక్షను కించిత్తు కూడా ప్రభావితం చేయలేకపోయారు. యోధుల శరీరాలను చిత్రహింసలకు గురిచేశారేమో గానీ, వారి స్ఫూర్తిని, కాంక్షను ముట్టుకోలేకపోయారు. శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ, రోజురోజుకూ బ్రిటిషర్లను దేశం నుంచి వెళ్లగొట్టాలనే సంకల్పం మరింత బలోపేతమైంది తప్ప, ఏనాడూ తగ్గలేదు.

అండమాన్ సెల్యులార్ జైలు, జలియాన్ వాలాబాగ్ వంటి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి కేంద్రాలను భారతీయులు తప్పనిసరిగా సందర్శించాలి. మన దేశానికి స్వేచ్ఛావాయువులు అందించేందుకు వారు చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు, వారి త్యాగాల నుంచి ప్రేరణ పొందేందుకు ఈ యాత్రలు ఉపయోగపడతాయి.

40 మంది స్వాతంత్ర్య కోసం పనిచేసి అమరులైన మన మహిళా స్వాతంత్ర్య వీరాంగల గురించి తెలిపే జ్వాలామణులు పుస్తకం కొరకు సంప్రదించండి... మా వాట్సాప్ నెంబర్: +91 8500581928 నెంబర్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments