స్వామి వివేకానంద జీవిత చరిత్ర - swami vivekananda biography in telugu

megaminds
0

‘నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధారు ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృతమవుతుంది’
– స్వామి వివేకానంద
భౌతిక వాదం విస్తరిస్తూ వెర్రితలలు వేస్తున్న సమయంలో; ఒకపక్క శతాబ్దాలుగా చెలరేగుతున్న మతోన్మాదం, సామ్రాజ్య వాదం నుండి; మరోపక్క పెట్టుబడిదారి వ్యవస్థ నుండి, ఇటు కమ్యూనిస్టు వ్యవస్థ నుండి ప్రమాదం సంభవిస్తున్న సమయంలో జన్మించిన స్వామి వివేకానంద తన ఆధ్యాత్మిక జ్ఞానంతో మానవ నాగరికత వికాసానికి బీజం నాటారు.
గురువు సన్నిధిలో..
వివేకానందునికి బాల్యం నుండే భగవంతుడిని దర్శించాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అది వయస్సుతో పాటు పెరుగుతూ వివేకానందుడ్ని రామకృష్ణ పరమహంస దగ్గరకు చేర్చింది. రామకృష్ణ పరమహంస సన్నిధిలో ఈ చరాచర సృష్టిలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడని గుర్తించి, మానవ సేవయే మాధవసేవ అని భావించి, ఆచరించి, సాధించి చూపినవారు స్వామి వివేకానంద. సమకాలీన పరిస్థితులను అర్ధం చేసుకోవటమే కాకుండా ఆ పరిస్థితులు నిర్మాణం కావటానికి మూల కారణాలను కూడా అధ్యయనం చేసి ఈ దేశాన్ని మళ్లీ జగద్గురువుగా నిలబెట్టడానికి ఏం చేయాలో చెప్పినవారు స్వామి వివేకానంద.
స్వాభిమానానికి ప్రేరణ
స్వాభిమానం కోల్పోరున జాతి ఎట్లా పతనం చెందుతుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారతజాతి. అందుకే ఈ జాతిలో స్వాభిమానం నిర్మాణం చేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు స్వామి వివేకానంద. ఆ రోజుల్లో దేశంలో సంస్కరణ వాదుల హడావిడి ఎక్కువగా ఉండేది. వారి గురించి మాట్లాడుతూ స్వామి వివేకానంద ‘ఈ హడావిడి సంస్కరణవాదులు చేసే పనులు అంత ప్రయోజన కరం కాదు. ఈ దేశంలో నిజమైన సంస్కర్తలకు ఎప్పుడూ కరువు లేదు. భారతదేశ చరిత్రను చదివితే రామానుజులు, శంకరాచార్యులు, చైతన్య మహాప్రభు, కబీరు వంటి నిజమైన సంస్కర్తలు ఒకరి తరువాత ఒకరుగా ఉదరుంచి ఈ దేశాన్ని ఉద్ధరించారు. రామానుజులవారు నిమ్న జాతుల పట్ల కరుణ చూపారు, తాను బ్రతికి ఉన్నంతకాలం నిమ్నవర్గాల వారిని అక్కున చేర్చుకోటానికి ప్రయత్నించారు, మహమ్మదీయులను కూడా తన వారిలో చేర్చు కోడానికి ప్రయత్నించారు కదా ! నానక్‌ మహాశయుడు హిందువులతోను, మహమ్మదీయుల తోను సంప్రదించి పరిస్థితులు చక్కదిద్దలేదా ? వారందరూ సంఘ సంస్కరణ ప్రయత్నం చేసినవారు. సంస్కరణ అంటే పునరుద్ధరణ. అంతేకాని కూల ద్రోయటం కాదు. వారందరూ చేసిన ప్రయత్నాలు ఈ రోజునకూడా కొనసాగుతూనే ఉన్నారు’ అన్నారు.
స్వామి వివేకానంద ఇంకొక విషయం కూడా హెచ్చరించారు. ‘అనుకరించడం నాగరికత కాదు. అది అనాగరికమే అవుతుంది. నేను రాజు వేషం వేసుకొన్నంత మాత్రాన రాజును కాగలనా ? సింహం చర్మం కప్పుకొన్న గాడిద సింహం అవుతుందా ? అనుకరణం పిరికితనంతో కూడుకొన్నది. తన పూర్వుల గురించి సిగ్గుపడుతున్న వారికి అంత్యకాలం మూడినట్లే. అందుకే నన్ను నేను హిందువుగా చెప్పుకొంటున్నాను. అందుకు గర్విస్తున్నాను. మనందరం మహర్షుల వంశముల వారమని కూడా గర్వపడుతున్నాను’ అన్నారు.
మత మహా సభలు – సింహ గర్జన
దేశ ప్రజలలో స్వాభిమానం నింపటానికి వివేకా నంద నిరంతరం కృషి చేశారు. ఆధ్యాత్మిక శక్తి ద్వారా భారత్‌ తిరిగి ప్రపంచంలో ఒక గౌరవనీయ స్థానంలో నిలబడాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ప్రపంచ కల్యాణం సాధించవచ్చు అని భావించి దాని కోసం చికాగోలో జరిగిన ప్రపంచ మత మహా సమ్మేళనంలో స్వామి వివేకానంద పాల్గొన్నారు. ఆ సభలో స్వామి వివేకానందుని మొదటి రోజు ఉపన్యాసం సింహ గర్జనే. ఆ గర్జన విని యావత్‌ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. అద్భుతమైన వారి జ్ఞానానికి పాశ్చాత్య ప్రపంచం ఆశ్చర్యపోరుంది. అంతటి జ్ఞాన సంపన్న దేశానికా మన మత బోధకులను పంపేది !? అని పాశ్చాత్యులు ఆలోచనలో పడ్డారు. ఆ సభలు హిందుత్వ ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రంగా ముగిశారు. స్వామి వివేకానంద ఆ సభల తదుపరి ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు.
స్వామి వివేకానంద 1897 నుండి నాలుగు సంవత్సరాలపాటు అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో అమెరికాలో భోగవాదం వెర్రితలలు వేస్తున్న సమయం. అప్పుడు వారి గురించి చెపుతూ స్వామి వివేకానంద ‘భవిష్యత్‌లో వారు మనదేశం నుండి జ్ఞాన జ్యోతులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారు’ అన్నారు. అమెరికా వాసులతో వివేకానంద ఆ రోజుల్లోనే ‘ఈ రోజు కాకపోతే రేపటి రోజైనా మీరు మా దగ్గరకు వస్తారు’ అని చెప్పారు. అది ఇప్పుడు కనిపిస్తోంది. స్వామి వివేకానంద అప్పుడు వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతులు నేడు ప్రపంచాన్ని జ్ఞాన యుగం వైపు తీసుకెళ్తున్నాయి.
విస్తరిస్తున్న భారతీయత
నాడు స్వామి వివేకానంద భోధనల ఫలితంగా నేడు మనదేశంలో ధార్మిక నేతల పరంపర కనబడు తున్నది. ఈ ధార్మిక నేతలు యావత్‌ ప్రపంచాన్ని తమ ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రభావితం చేస్తూ ప్రపంచ కల్యాణానికి బాటలు వేస్తున్నారు. ప్రపంచంలో నేడు మంచి శక్తులన్నీ ఒక చోటకు చేరే సానుకూల వాతావరణం నిర్మాణమవుతున్నది. ప్రపంచానికి ఈ రోజున భారత్‌ కేంద్ర బిందువు అవుతున్నది. పూజ్య రవిశంకర్‌ గురూజీ కొద్ది సంవత్సరాల క్రితం నిర్వహించిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ రజతోత్సవ వేడుకలలో 160 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారందరితో ‘నేను మీకు మనశ్శాంతిని మాత్రమే ఇస్తా’ నన్నారు. గురు రాందేవ్‌ బాబా లండన్‌లో ఒక వారం రోజులు యోగ కార్యక్రమం నిర్వహిం చారు. అది ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు జరిగింది. ఆ సమయంలో అక్కడి ప్రజలు బయటకు రావటమే సాహసం. కాని వచ్చారు. అట్లాగే కొద్ది సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘ప్రపంచ యోగ దివస్‌’ కార్యక్రమం ప్రపంచంలో అనేక దేశాలలో జరుగు తున్నది. ఈ విధంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఆధ్యాత్మికత, మానవతా విలువలు, యోగ శిక్షణ విస్తరిస్తున్నారు. రాబోవు రోజులలో ప్రపంచం లో మంచి పరివర్తన రాబోతున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు ధర్మ సంస్థాపన కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయటంలో భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం తన పని తాను చేసుకొంటూ వెళుతున్నది.
భారతమాతే మన దేవత
స్వామి వివేకానంద చికాగో సభల తరువాత దేశమంతా విస్తృతంగా తిరిగారు. ఆయన ఇలా అన్నారు ‘మనలో ఒకడు ఎదగాలని ప్రయత్నిస్తే మిగతావారు అతనికి అడ్డంకులు కల్పిస్తుంటారు. అలా ఎప్పుడూ మనలో మనం కలహించుకుంటుంటాం. కాని ఒక విదేశీయుడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు అందరం కలిసిపోతాం. అంటే సమస్య వచ్చినప్పుడు మాత్రం కలిసి పనిచేస్తాం. లేదంటే కొట్టుకుంటుంటాం. అది బానిస బుద్ధి. మనం అలాంటిదానికి అలవాటు పడి ఉన్నాము. బానిసలు ఎప్పుడైనా గొప్ప నాయకులు కాగలరా ? కాబట్టి బానిసలు కావటం మానుకోండి. రానున్న యాభై సంవత్సరాల వరకు మన దివ్య భారతమాతే మన అధిష్టాన దేవతగా ఉండుగాక. అంతవరకు ఇతర దేవతలందరూ మన మనస్సుల నుండి అదృశ్యమగుదురు గాక. ఈమె ఒక్కతే జాగృదావస్థలో ఉండవలసిన ప్రధాన దేవత. మూర్తీభవించిన మన జాతి స్వరూపం’. ఈ విధంగా స్వామి వివేకానంద దేశీయులలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఆ తరువాత స్వాతంత్య్ర పోరాటానికి ఒక ఊపునిచ్చింది. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా పనులు వేగవంతంగా ప్రారంభమైనారు.
‘నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధారు ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృత మవుతుంది’ అని స్వామి వివేకానంద చెప్పారు. అది ఈ రోజున మనకు కనిపిస్తున్నది. ఇప్పుడున్న అనేక సమస్యలను, ఆటంకాలను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నది వాళ్ళే.
విదేశీయులకు సైతం ప్రేరణ
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి వివేకానంద బోధనలే. ఇండోనేషియాలో డచ్‌ పరిపాలనకు వ్యతిరేకంగా సుకర్ణో నేతృత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరుగుతోంది. సుకర్ణోను, అతని ముఖ్య అనుచరులను డచ్‌ ప్రభుత్వం నిర్బంధించి జైలులో పెట్టింది. సర్వత్రా నిరాశ నిస్పృహలు ఆవహించి ఉన్న ఆ సమయంలో డచ్‌ భాషలో అనువాదం అయిన స్వామి వివేకానంద బోధనలను సుకర్ణో చదివాడు. దానిలో సుకర్ణోను అమితంగా ప్రభావితం చేసిన మాటలు ‘మనం ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం. ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు. లే ! లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు !’. ఆ మాటలు సుకర్ణోను ఎంతో కదిలించాయి. అతనిలో అనంత ఆత్మ విశ్వాసం నిర్మాణమైంది. ఆ ప్రేరణతోనే తన పోరాటంలో విజయం సాధించి తన దేశానికి స్వతంత్య్రం సంపాదించుకొన్నాడు.
స్వామి వివేకానంద వేలాది సంవత్సరాల మన సంస్కృతిని, ప్రపంచ కల్యాణాన్ని సాధించే మన జీవన మూల్యాలను మళ్ళీ గుర్తు చేశారు. దాని ఆధారంగా ప్రజలను కదిలించారు. ఆ శక్తి ద్వారా ఈ దేశ ప్రగతికి బాటలు వేయాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా భారత జాతీయత గురించి విశేషమైన చర్చ జరుగుతున్నది. రాజకీయ, సామాజిక పరమైన జాతీయ వాదాన్ని అంగీకరించాలా ? లేక సాంస్కృతిక జాతీయ వాదాన్ని అంగీకరించాలా ? అనే చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో సాంస్కృతిక జాతీయ వాదంవైపే మేధావులు మొగ్గు చూపడం కనపడుతోంది. అందుకే నేడు ఈ దేశవాసులంతా ‘సంస్కృతి పరంగా మేమందరం ఒకే జాతి’ అని స్పష్టంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన వైఖరి రావాలి. అంతేకాక దేశంలోని అనేక రంగాలలో ఈ దేశ జాతీయత మళ్ళీ ప్రతిబింబి స్తోంది. స్వామి వివేకానంద ఆనాడు చెప్పిన విషయాలు నేటికీ ఆచరణీయాలే.
– రాంపల్లి మల్లికార్జునరావు
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top