హర్యానా ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కురాలైన కేబినెట్ మంత్రి, ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు, ప్రఖ్యాతి చెందిన విదేశాంగ మంత్రి. అన్నింటికీ మించి శ్రీమతి సుష్మా స్వరాజ్ ఒక మంచి వక్త, సాహసనారి, అంకిత భావం గల నాయకురాలుగా ప్రసిద్ధి పొందారు. పడకుండా రక్షించుకోవడం కాదు... పడినప్పటికీ మరింత బలం, స్పష్టతతో లేచి నిలబడడం ఆమె విజయ రహస్యం.
"ప్రధానమంత్రిగారు, ధన్యవాదాలు. నా జీవితకాలంలో ఇది చూడాలని నేను ఎంతగానో వేచి ఉన్నాను". రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు ప్రకటన వెలువడిన రోజున... మరణానికి కొద్ది గంటల ముందు చివరి బహిరంగ చర్చలో ఆమె నోటి నుంచి వెలువడిన మాటలివే.
ఆమె ఏడు విడతలు ఎంపిగా, మూడు విడతలు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన ఐదో వ్యక్తి, తొలి మహిళ ఆమె 15వ లోక్సభలో ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా కూడా వ్యవహరించారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా; విదేశాంగ మంత్రిగా ఆమె పనిచేశారు.
అవును, మేం మతవాదులమే" అని ప్రకటన "అవును. వందేమాతరం గీతాలాపనకు మద్దతిస్తాం గనుక మేం మత వాదులమే. జాతీయ పతాక గౌరవం కోసం పోరాడతాం గనుక మేం మతవాదులమే. 370వ అధికరణం రద్దుకు డిమాండు చేస్తాం గనుక మేం మతవాదులమే" అని లోకసభలో చేసిన ప్రకటన సిద్ధాంతాల పట్ల ఆమెకు గల అంకిత భావానికి, స్పష్టతకు మచ్చు తునక.
సుష్మా స్వరాజ్ ఎల్లప్పుడూ సహాయ హస్తం అందించే వారు విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో యెమెన్ సంక్షోభం ఏర్పడినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలను దేశానికి తరలించే కార్యక్రమానికి ఆమె నాయకత్వం వహించారు. ఆపరేషన్ రాహత్ కింద 4741 మంది భారతీయులతో పాటు 48 దేశాలకు చెందిన 1947 మందిని రక్షించారు. యెమెన్ సంక్షోభసమయంలో తన ఎనిమిది నెలల వయసు గల భారతీయ శిశువుతో అక్కడ చిక్కుకుపోయిన యెమెన్ మహిళ సబా సవేష్ ట్వీట్కు శ్రీమతి స్వరాజ్ స్పందించారు. ఆమెను కూడా రక్షించేలా శ్రీమతి సుష్మా స్వరాజ్ చర్యలు తీసుకున్నారు. అలాగే మనుషులను అక్రమ రవాణా చేసే గ్యాంగ్ చేతిలో యుఏఇలో బందీగా ఉన్న ఒక వ్యక్తి సోదరిని కూడా కాపాడేందుకు ఆమె త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. లివర్ మార్పిడి అవసరం అయిన ఐదు సంవత్సరాల పాకిస్తాన్ బాలిక కావచ్చు లేదా మాట, వినికిడి కూడా లేని భారతీయ బాలిక గీత కావచ్చు అవసరంలో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవడంలో శ్రీమతి సుష్మా స్వరాజ్ ఒక ఉదాహరణగా నిలిచారు.
సుష్మా స్వరాజ్ ప్రసంగం సమర్థవంతమే కాదు. స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. సుష్మాజీ ఆలోచనల లోతును ప్రతీ ఒక్కరూ గ్రహించడమే కాదు, ఆమె అనుభవంలోని ఉన్నతి ప్రతీ క్షణంలో నూతన ప్రమాణాలు నెలకొల్పేది. సుదీర్ఘమైన సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యం.

