Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాళోజీ పుట్టిన రోజు-kaloji narayana rao

మన కాళన్న పుట్టినదినమట. మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళోజీని ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న  తన రాతతోటి ,తీరుతోటి మన గుండెల...

మన కాళన్న పుట్టినదినమట. మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళోజీని ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న  తన రాతతోటి ,తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు గనుక.
జనం దిక్కు నిలబడ్డడు..జనం కొరకే బతికిండు. జనంకోసమే కవితలు చెప్పిండు.  జనం తరుపునే మాట్లాడిండు. జనం తరుపున్నే కొట్లాడిండు.  అన్యాయం మీద తిరగబడమన్నడు. అవినీతి మీద పోరు చెయ్యమన్నడు.

ఓసీ ప్రభుత్వమా దోపిడీవర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు
పీడిత వర్గాల నేను తిరగబడమంటే తప్పా అని జనం ముందు ఉండి పులిలెక్క గర్జించిండు..సింహంతీర్గ గాండ్రించిండు.

చిన్న గొడవనా అది. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే నా గొడవకు విముక్తి అని చాటిండు.
దిగజారుతున్న సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్య విలువలమీద కాళోజీ మండిపడ్డడు.
కాళోజీ జీవితమంతా పోరాటం జేసిండు. బతుకంతా ఉద్యమాలు జేసిండు . పోరాటోద్యమాలల్ల జనం  గొడవను తన గొడవగ ప్పిండు. అది గుడ అందరికీ అల్కక అర్థమయ్యే పలుకుబళ్ల భాషల.

మనుషులమధ్య వ్యత్యాసాల్ని సహించలేదు. ప్రశ్నించలేని బతుకూ ఓ బతుకేనా అన్నడు
మనిషిమీద ఇంకోమనిషి పెత్తనాన్ని , దౌర్జన్యాన్ని ప్రశ్నించిండు. ప్రజల ఆవేదనను ఆవేశంగా కవితారూపంలో వెదజల్లిండు.
రాజకీయాల్లో అవినితీని జూసి కాళన్న కలత చెందిండు..
అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని
దొరలై వెలిగే దెన్నాళ్లు అని మదన పడ్డడు.

ప్రజాజీవితాన్ని కవితలో ప్రతిబింబించిన ప్రజాకవి కాళన్న.మనిషిని మనిషిగా బతుకాలే అని చెప్పిన మహా మనీషి కాళన్న. చిన్నప్పుడు బడిలో  గణపతి ఉత్సవాలు జరపనీయనందుకు  లేచిన ఆ ధిక్కార స్వరం  చివరికంటా దిక్కుల్ని పిక్కటిల్లేలా చేసింది. ఆర్యసమాజం, గ్రంథాలయోద్యమం, హైదరాబాద్ స్టేట్ విమోచనోద్యం
ప్రత్యేక తెలంగాణోద్యమం ,  హక్కుల ఉద్యమం...ఇన్నింట్ల పాల్గొన్నడు
అందుకనే కాళోజీ జీవితమంటే తెలంగాణ చరిత్ర.
చెలిమలు చెలమలు ఊరేదాక
చెలిమి కలుములు నిలిచేదాకా
బ్రతుకమ్మ బ్రతుకు
అమ్మను మరువని సంతానము కని
బ్రతుకమ్మా బ్రతుకు అని బతుకమ్మను ఎంత సక్కగ బతికిచ్చిండు.

అభ్యర్థి ఏపార్టీ వాడని కాదు
ఏపాటివాడో చూడు
మనిషిని చూడు-చరిత్రను చూడు
నుడువులు కాదు,నడవడి చూడు
ఎంతసక్కని మాటలివ్వి. ఇట్లాంటివి కాళోజీ కాక ఇంకెవ్వరన్నా చెప్పుదురా

కాళోజీకి భాషంటే ఇష్టం. యాసంటే ప్రాణం. తన యాసను యీసడిస్తూ మాట్లాడేటొళ్ల అవహేళనను తిప్పికొట్టిండు. వాక్యంలో మూడు పాళ్లు ఇంగ్లీష్ వాడుకుంటూ తెలంగాణీయుల మాటలో ఉర్దూపదం దొర్లంగనే హిహి అని ఇగిలిస్తరా అని కన్నెర్ర జేసిండు.
అన్ని రుతువులనూ తట్టి చూసిన కాళోజీ...
హిమవంతుడు నింగి చీల్చి
తలదూర్చగ హేమంతం
జీవనదుల జీవనముల
సమకూర్చగ హేమంతమంటూ ఎంత ముద్దుగ..ఎంత సరళంగ వర్ణించిండు.

గొప్పదేశభక్తుడైన కాళోజీ ....
అంబవు వజ్రపు  గుండెగల చెండివి నీవెనమ్మా
మేమంతా నలుబది కోట్లు నీ సంతానమే
నిజముగ భరతమాతవు నీవేనమ్మా తల్లీ అని భరతమాతను ఎంత ఉన్నతంగ కొనియాడిండు.

ఇతివృత్తం ఏదైనా ఏనాటి ఇతిహాసమైనా
మానవతా వికాసానికి దానవతా నిర్మూలానికి ప్రేరణ నీకళే  కద అన్న కాళన్న మాటలు ఆణిముత్యాలే కద.

నీపొత్తిలిగుడ్డలెత్తి ఉతికి
నిన్ను యెదకు హత్తుకున్న అమ్మకు
నీ చెత్తాచెదారం పనులకు
వీపు చెదర చరిచే అధికారం
ఎక్కడిదనిఅడుగకు అంటూ...అమ్మగురించిన మన కాళన్న చెప్పిన ఈమాటలింటె కళ్లు చెమర్చకుండ ఉంటయా.

CONSPIRACY కేవలం ఐఎంఎఫ్ దేనా ? దేశంలోని దోపిడీ వర్గాలు వారికి సాయపడే దేశీయ ప్రభుత్వాన్ని గదా మనం  ఎదురించవలసింది... కుట్రను బైటపెట్టవలసిందీ అన్నడు.. మనకు అందుబాటులోలేని మనం ఎదురించలేని ఐఎంఎఫ్ ని తిట్టి ఏం లాభం అంటూ సామాన్యుల కోణంలో ఎట్లా ఆలోచించిండు కదా.
పీవీ అన్నట్టు కాళోజీ ఏనాడు సింహగర్జన చేశాడో ఆ కాలం మళ్ల రాదు. ఈనాటి కాలం సింహగర్జన చేయాలంటే ఎవరూ వినరు.
మళ్లీ ఒ క దుమారంగా రేగండి
మళ్లీ ఒక ఉప్పెంనగా  లేచి దూకండి
అవినీతిని గద్దెదించండి...లేవండి లేవండి ...ఎంత ఊపుంది ఈ మాటల్ల.
సామాన్యుల గురించి ఇట్ల అసామాన్యంగా చెప్పినోడు ఇంకెవడన్నా ఉన్నడా.

చెవిసోకిన వాణి శృతిగ
తలనిలిచిన వాణి స్మృతిగ
వేదవేదాంగములందున
విదితమై వేడ్కతోనే
భారతీశారదా వాణీ
వీణాపాణినీ రాణీ..అంటూ వాణిని వీనులవిందుగా ఎంత చక్కగ కీర్తించిండు.
ఎదురూబొదురూ లేని అధికారం
ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతమే ఫాసిజం అన్న ఆయన మాటలకు వెలకట్టగలరా ఎవరైన.

కాళన్నిది నిక్కచ్చైన నిఖార్సైన వ్యక్తిత్వం. ఎక్కడ ఆధిపత్యం అధికార దుర్వినియోగం ఉన్నయో ఆడ వాలిండు. కవిత కట్టిండు. మనిషిని మనిషిగా చూడనిచ్చే సమాజమే తన ఆకాంక్ష అంటూ ఆశపడ్డడు.
కాళన్న కవిత్వ శక్తిమంతమైతే ఆయన జీవితం నిరాడంబరం .విలువలతో ప్రమాణాలతో బతికిండు.
ఇంత గొడవచేస్కంటనే ఇది సరిపోదన్నడు. నేనింకా నానుంటి మాదాకానే ఎదగలేదు. మనం అన్నప్పుడు కదా ముందడుగు అన్నడు. కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గొడువొక్కడి..తెలంగాణ వెలసినిలిచి ఫలించాలె భారతాన అని ఆకాంక్షించిండు.

మనిషికోసం వ్యవస్థతో గొడపపడిండు. సామాన్యుడిని తక్కువ చేసిన వాడినితెలంగాణ ద్రోహుల్ని దునుమాడిండు.
ఉదయం కానేకాదనుకోవడం
నిరాశ
ఉదయించి అట్లానే ఉంటుందనుకోడం
దురాశ అంటూ భాషించిన కాళన్నను ఎవరైనా ఎట్ల యాది మరుస్తరు.

ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు
వర్తకుని వ్యాజ్యాలు వక్కీళ్ల వాదాలు
సైనికుని శౌర్యాలుయాంత్రికుని యంత్రాలు
యోధుల యుద్ధాలు రాజుల రాజ్యాలు
కర్షకా నీ కఱ్రు కదిలినన్నాళ్లే అని రైతు గొప్పతనం గురించి..సమాజానికి రైతు అవసరం గురించి చాటిచెప్పిండు..ఇట్ల ఇన్ని మరువలేని,మరువరాని ముచ్చట్లు చెప్పినకాళోజీని తెలంగాణ  ఎట్లమరుస్తది. ..ఎందుకు మరుస్తది..

అవును కాళోజీ నిన్నటి స్వప్నం.. రేపటి జ్ఞాపకం, కాళోజీ ప్రస్తుతం, కాళోజీ ఇప్పటి క్షణం, కాళోజీ నిగనిగలాడ నెగడు, రేపును రేపే దగడు.
##దేవిక##

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments