Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పతిత్ పావన్ ఘోష్ .....ఈ సారి నువ్వు చెప్పులు కొనుక్కోవచ్చు - raka sudhakar

పతిత్ పావన్ ఘోష్...32 ఏళ్ల నీ నిరీక్షణ ఫలించింది. ఈ సారి నువ్వు ఖాయంగా చెప్పులు కొనుక్కోవచ్చు. నిజం...ఒకటా రెండా ...32 ఏళ్ల పాటు నువ్వీ...

పతిత్ పావన్ ఘోష్...32 ఏళ్ల నీ నిరీక్షణ ఫలించింది. ఈ సారి నువ్వు ఖాయంగా చెప్పులు కొనుక్కోవచ్చు.


నిజం...ఒకటా రెండా ...32 ఏళ్ల పాటు నువ్వీ ఘడియ కోసం ఎదురుచూశావు. ఎండనక, వాననక, బురదనక, వరదనక...చెప్పుల్లేకుండానే తిరిగావు. స్కూల్లో పిల్లలు నిన్ను చెప్పుల్లేని మాస్టారు అని వెక్కిరించారు. ఊళ్లో అంతా మట్టిరోడ్డుపై మూడు దశాబ్దాలకు పైబడి నడిచి నడిచి అరిగిపోయిన నీ కాళ్ల వైపు చూసి నవ్వేవారు. నీ శత్రువులు మాత్రం "ఏయ్ పంతులూ....ఈ జీవితంలో నువ్వు చెప్పులు వేసుకోగలననుకుంటున్నావేమో....అది కల్ల ...." అని వెటకారం చేసేవారు. 

అయినా నువ్వు మాత్రం నీ ప్రతిజ్ఙను మరిచిపోలేదు. ఈ సర్కారు పోయే దాకా...."ఈ కమ్యూనిస్టు అరాచకం పోయే దాకా నా కాళ్లకి చెప్పులు తొడగను " అని ప్రతిజ్ఙ చేశావు. అదీ 1979లో. అప్పట్నుంచీ ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. చివరి క్షణంలో కాంగ్రెసు కుమ్మక్కవడం వల్లో, కమ్యూనిస్టుల సైంటిఫిక్ రిగ్గింగ్ వల్లో, భయం వల్లో ఓట్లన్నీ కంకీ కొడవలికే పడేవి. మళ్లీ కమ్యూనిస్టులే గెలిచేవారు. నువ్వు చెప్పులేసుకునేందుకు మరో ఎలక్షన్ కోసం ఎదురు చూసేవాడివి. 

1977లో బెంగాల్ కి ఎర్ర తెగులు పట్టుకుంది. కమ్యూనిస్టుల పాలన మొదలైంది. కమ్యూనిస్టుల దౌర్జన్యాలూ మొదలయ్యాయి. బెదిరింపులు, భౌతిక దాడుల పర్వం మొదలైంది. పశ్చిమ బెంగాల్ లో డెబ్రా నియోజక వర్గం లో అప్పుడు నువ్వు టీచర్ వి. నీకప్పుడు 35 ఏళ్లు. "సార్...మా రాజ్యం వచ్చేసింది. ఇక మా పార్టీలో చేరిపొండి...మీకదే మంచిది" అని మార్క్సిస్టులు బెదిరించడం మొదలుపెట్టారు. నువ్వు ఒప్పుకోలేదు. 

చివరికి ఓ రోజు నీ సొంతూరు కువాపోట్ నుంచి చాక్ చంద్రమర్ ప్రైమరీ స్కూలుకు వెళ్తూండగా నందాబాడి దగ్గర మార్కిస్టు గుండాను నిన్ను అటకాయించి, చెట్టుకి కట్టేశారు. ఎనిమిది గంటల పాటు చెప్పులతో నిన్ను కొట్టారు. కాదు కాదు...ప్రజాస్వామ్య హక్కుల్ని కొట్టారు. స్వేచ్ఛను కొట్టారు. అభివ్యక్తి స్వాతంత్ర్యాన్ని కొట్టారు. 
అయినా నువ్వు ఎర్ర వెర్రిని అంటించుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి విసుగొచ్చి వాళ్లు వదిలేశారు. 

అప్పుడు చేశావు నువ్వు ప్రతిజ్ఙ...."ఈ మార్క్సిస్టులు నన్ను చెప్పుతో కొట్టారు. ఈ మార్క్సిస్టు ప్రభుత్వం పోయే దాకా నేను కాళ్లకి చెప్పులు వేసుకోను." అన్నావు. అప్పటినుంచీ నువ్వు చెప్పుల్లేని మాస్టారువయ్యావు. చివరికి చెప్పుల్లేకుండానే రిటైర్ అయ్యావు. 67 ఏళ్లు వచ్చినా నీ పట్టుదల తగ్గలేదు....ఆశావహ దృక్పథమూ ఆవిరైపోలేదు. 

మామూలు వాళ్లైతే నీరుకారిపోయేవారు. కానీ నువ్వు నిరంకుశ కమ్యూనిస్టు మారాజులకన్నా మహామొండివాడివి. "ముళ్లున్న కొమ్మలతో కమ్యూనిస్టులు నన్ను కొట్టారు. ఈ 31 ఏళ్లలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఇప్పుడు చెప్పుల్లేకున్నా ఆత్మాభిమానం మాత్రం పుష్కలంగా ఉంది" అని నువ్వు గర్జించావు. నిన్ను కొట్టిన వాళ్లని చూసి ఏనాడు తల వంచుకోలేదు. ఇప్పుడు వాళ్లే వాళ్ల తలల్ని ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి మరి.

ఇప్పుడు 34 ఏళ్ల తరువాత బెంగాల్ కి పట్టిన ఎర్ర తెగులు తొలగిపోయింది. కమ్యూనిస్టుల కథ కంచికెళ్లబోతోంది. 
ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవడు గెలుస్తాడో...ఎవడు ఓడిపోతాడో నీకక్కర్లేదు. కూటములు, పొత్తుల అవసరం నీకు లేదు. ఎవడు ముఖ్యమంత్రైనా నీకు అక్కర్లేదు. పేదోడి పేరు చెప్పి తెగబలిసిన కండకావరపు కమ్యూనిస్టు ప్రభుత్వం బెంగాల్ లో పేకమేడలా కూలిపోబోతోంది. నీకు అది చాలు....

పతిత్ పావన్ ఘోష్ ....ఇంకో 30 గంటల్లో నువ్వు 32 ఏళ్ల నుంచి ఎదురుచూసిన క్షణం రాబోతోంది. 

పతిత్ పావన్ ఘోష్ ....నువ్విక చెప్పులు కొనుక్కోవచ్చు...ఖాయంగా...

ఎర్ర రంగు చెప్పుల్ని కొనుక్కో...ఇక అవి నీ కాళ్లకిందే పడుంటాయి.


(పతిత్ పావన్ ఘోష్ కథను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను. బెంగాల్ లో ఇలాంటి వాళ్లు ఎందరో...బెంగాల్ లో కొత్త యుగం ప్రారంభమౌతున్న సందర్భంగా వారందరికీ అంకితం)


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



No comments