ప్రపంచీకరణ వ్యవస్థ-వాణిజ్య నియంత్రణ-Globalization

megaminds
0
Image result for globalization

ప్రపంచీకరణ వ్యవస్థ నియమ నిబంధనలను సంపన్న దేశాల ప్రభుత్వాలు బాహాటంగా ఉల్లంఘిస్తుండడం ‘అంతర్జాతీయ ఇంధన సమాఖ్య’ మంత్రుల స్థాయి సమావేశానికి విచిత్ర నేపథ్యం. డెబ్బయి రెండు దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ మంత్రుల స్థాయి సమావేశం బుధవారం ఢిల్లీలో జరుగుతున్న సమయంలోనే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య సమరం తీవ్ర స్థాయికి చేరడం సమాంతర పరిణామం! ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- వ్యవస్థీకరించిన ‘స్వేచ్ఛా విపణి’-మార్కెట్ ఎకానమీ- ఫలితంగా కృత్రిమ అంతర్జాతీయ అనుసంధానం బలపడింది, బలపడుతోంది. ఈ కృత్రిమ అనుసంధానం వల్ల సంపన్న దేశాల వస్తువులు మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలను ముంచెత్తుతున్నాయి. మన దేశంలో పెట్రోలియం ఇంధనం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి! ‘ప్రపంచీకరణ’తో సమాంతరంగా వ్యవస్థీకృతమైన బహుళ దేశ వ్యవస్థలలో ‘అంతర్జాతీయ ఇంధన సమాఖ్య’- ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్- అత్యంత ప్రధానమైనది. పెట్రోలియం ఇంధనాన్ని ఉత్పత్తిచేస్తున్న, వినియోగిస్తున్న, పంపిణీ చేస్తున్న దేశాల మధ్య సమన్వయ వ్యవస్థగా ఈ ‘్ఫరమ్’ ఏర్పడి ఉంది. ఈ ‘్ఫరమ్’లో అనేక దేశాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఇంధనం ధరలను నిర్ణయించడంలో ఇది కేవలం సలహాలను మాత్రమే ఇవ్వగలదన్నది అంతర్జాతీయ వాస్తవం. ‘పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య’ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్- ఒపెక్- వారు, ‘అంతర్జాతీయ ఇంధన సాధికార సంస్థ’- ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ- ఐఇఏ- వారు ధరల నిర్ణయంలో అసలు సూత్రధారులు. మన్‌మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మన అంతర్గత పెట్రోలియం పంపిణీ వ్యవస్థను అంతర్జాతీయ విపణితో అనుసంధానం చేశారు. అప్పటి నుంచి పెట్రోలియం పదార్థాల ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణను కోల్పోయింది! అంతర్జాతీయ అనుసంధానం వివిధ రంగాలకు విస్తరించాలని అదే సర్వసమగ్ర అనుసంధానమని మన్‌మోహన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ అనుసంధానం విస్తరిస్తున్నకొద్దీ సార్వభౌమ దేశాలు ప్రధానంగా మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాల ‘ఆర్థిక స్వాతంత్య్రం’ హరించుకొని పోతుండడం నడుస్తున్న చరిత్ర! అమెరికా, ‘ఐరోపా సమాఖ్య’ దేశాలు, చైనా వంటి సంపన్న ప్రభుత్వాలు తమ ఆర్థిక సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకొనడానికై ‘సంకుచిత’- ప్రొటక్షనిస్ట్- వాణిజ్య విధానాలకు ఒడిగట్టుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధానికి ఈ సంకుచిత వాణిజ్య విధానాలే కారణం!
ఇంధనం ధరలను బాధ్యతాయుతంగా నిర్ధారించాలన్న అంతర్జాతీయ ఆకాంక్ష ఢిల్లీలో బుధవారం జరిగిన ‘్ఫరమ్’ సదస్సుకు ఇతివృత్తమన్నది సదస్సులో ప్రసంగించిన మన ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాట! కానీ ఈ ‘్ఫరమ్’ పదహైదవ సదస్సుకూ ప్రస్తుత పదహారవ సదస్సునకూ మధ్య గడిచిన రెండేళ్ల కాలవ్యవధిలో అంతర్జాతీయ విపణిలో పెట్రోలియం ధరలు విపరీతంగా పెరగడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ‘్ఫరమ్’లోను, ‘ఓపెక్’లోను కూడ సభ్యత్వం ఉన్న దేశాలు ఇందుకు సమాధానం చెప్పవలసింది. ఎందుకంటె ఎగుమతి చేస్తున్న దేశాల- ఓపెక్-వారు కలసికట్టుగా ధరలను పెంచుతున్నారు. కృత్రిమ కొరతను కూడ సృష్టిస్తున్నారు. అవకాశం లభించిన కొద్దీ దోచుకోవడం స్వేచ్ఛా విపణి స్వభావం! స్వేచ్ఛా విపణికి మానవీయ హృదయం లేదు. లభ్యత, నాణ్యత, సుస్థిరత, సురక్ష- ఈ నాలుగూ మన ఇంధన వ్యవస్థకు నాలుగు స్తంభాలన్నది సదస్సులో మోదీ చెప్పిన మాట! కానీ ఈ నాలుగింటినీ ‘ఎగుమతి చేస్తున్న దేశాల’వారు నియంత్రిస్తున్నారు, అంతర్జాతీయ అనుసంధానం నిర్దేశిస్తోంది! ఈ అంతర్జాతీయ అనుసంధానం అంతర్గత విపణిలో పెట్రోలియం పదార్థాల ధరలను పెంచుతోంది- ఇంధన వాయువు, - వంట ఇంధనం- ఎల్‌పిజి- దిగుమతిలో మన దేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ముడి పెట్రోలియం వినియోగంలో మనది మూడవ స్థానం. అంతర్గతంగా పెట్రోలియం ధరలు పెరగకుండా ప్రభుత్వం రాయితీలను ఇవ్వడం ‘ప్రపంచీకరణ’ నియమాలకు వ్యతిరేకం! అందువల్లనే మన ప్రభుత్వంపై ‘ప్రపంచ వాణిజ్యసంస్థ’ ఒత్తిడి పెరుగుతోంది. రాయితీల ద్వారా కాని, ఇతర ఆర్థిక ప్రమేయం ద్వారా కాని అంతర్గతంగా ధరలను అదుపు చేయడం ‘మార్కెట్ ఎకానమీ’ హోదాకు భంగకరమన్నది సంపన్న దేశాలు చేసిన ప్రచారం.
పెట్రోలియం ధరలను అంతర్గతంగా తాము తగ్గించజాలమన్న వాస్తవం మోదీ ప్రసంగంలో ధ్వనించింది. అంతర్జాతీయ విపణిలోనే బాధ్యతాయుతంగా ధరల నిర్ణయం జరగాలి! ‘ఉజ్వల’ పథకంలో భాగంగా మన దేశంలో నిరుపేదలకు ‘వంట ఇంధనం’ సరఫరా మొదలైన తరువాత అంతర్జాతీయ విపణిలో ‘గిరాకీ’ పెరిగింది. ‘గిరాకీ’ ప్రాతిపదికగా ధరలు పెరగడమే ‘మార్కెట్ ఎకానమీ’ వౌలిక సూత్రం! అందువల్ల మోదీ ఆకాంక్షించినట్టు అంతర్జాతీయ విపణిలో బాధ్యతాయుతంగా పెట్రోలియం ధరల నిర్ధారణ జరగడం దాదాపు అసంభవం. సౌర విద్యుచ్ఛక్తి, వాయు విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం ద్వారా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించడం ధరల అదుపునకు ఒక ప్రత్యామ్నాయం! అంతర్జాతీయ అనుసంధాన వ్యవస్థ నుంచి వైదొలగడం మరో ప్రత్యామ్నాయం! ‘ప్రపంచీకరణ’ ప్రభావం నుంచి బయటపడడానికి వీలుగా అమెరికా వలె, చైనా వలె మనం కూడ మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థికనీతిని నిర్ధారించుకోవాలి! ఇలా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే ఆర్థికనీతి సంకుచితమైనదని- ప్రొటక్షనిస్ట్- ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిర్దేశించింది. ఈ నియమాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్రను పోషించిన అమెరికా, ఐరోపా దేశాలు ఈ నియమాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నాయి. ఈ నియమాన్ని ప్రవర్ధమాన దేశాలపై రుద్దిన సంపన్న దేశాలు రెండు దశాబ్దుల పాటు లాభపడినాయి. కానీ చైనా వాణిజ్య సామ్రాజ్యవాదం విస్తరించడంలో అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వాలు ‘సంకుచిత’ విధానాలకు పూనుకున్నాయి. చైనా కూడ ‘సంకుచిత’ విధానాలను అమలు జరుపుతుండడం ప్రస్తుతం నడుస్తున్న వాణిజ్య యుద్ధానికి కారణం!
‘ప్రపంచీకరణ’ను, ‘అంతర్జాతీయ అనుసంధానా’న్ని వదిలించుకొనడానికి అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్నాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’కు వ్యతిరేకంగా అమెరికా ఆరంభించిన ప్రచారం ఊపందుకొంటోంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వస్తువుల వరద తమ దేశాలను ముంచెత్తకుండా నిరోధించడానికి వీలుగా ప్రపంచీకరణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పడమటి దేశాలు నడుం బిగించాయి. మన దేశానికి ఇది మరో వాణిజ్య పాఠం

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top