భారతదేశమంతా ఒకే సంస్కృతి కలిగి ఉందా? - Indian culture examples

megaminds
0
Indian culture examples


భారతదేశమంతా  ఒకే సంస్కృతి కలిగి ఉందా?

ఈ దేశంలో చదువు రానివాడికి సైతం కాశీ నుంచి రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల గురించి, పుణ్యనదుల గురించి, వాటి వెనుక కథల గురించి తెలుసు. దేశ స్వాతంత్య్రం తర్వాత మన సంస్కృతికి దూరమైన ఆధునిక మేధావులు, అందులోనూ ముఖ్యంగా వామపక్ష మేధావులు.. వలసవాదుల ప్రచారాన్నే ఇంకా నమ్ముతూ ఉండడం విడ్డూరం.

భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలనూ, వాటి చరిత్రనూ విశ్లేషిస్తూ దేశమంతటికీ యాత్రా మార్గదర్శిలాంటి పుస్తకం ఇటీవల ఆంగ్లభాషలో వచ్చింది. పుస్తక రచయిత్రి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ డయానా ఈక్‌. ఈవిడ మన దేశంలో పలుమార్లు పర్యటించి "India–A Sacred Geography '' అనే పుస్తకాన్ని రాసింది. పాశ్చాత్య రచయిత్రి రచించడం వల్ల ఇది ప్రధాన బుక్‌ స్టాళ్లలో లభిస్తోంది. ప్రస్తుత యువతలో మన పురాణాల పట్ల, మన పుణ్యస్థలాల పట్ల కొత్త ఆసక్తిని కలిగిస్తుంది.

19వ శతాబ్దంలో బ్రిటిష్‌ పాలకులు ఒక సిద్ధాంతాన్ని నూరిపోయడానికి ప్రయత్నం చేశారు. ‘భారతదేశానికి ఒకే సంస్కృతి అంటూ లేదు, భారతజాతి అనే భావన లేదు, భరత ఖండమంతా అనేక దేశాలుగా విభజించబడి ఉండేది. బ్రిటిష్‌ పాలన వల్లనే ఇదంతా ఒక జాతిగా ఏర్పడింది’ అని బ్రిటిష్‌ రచయితలు చెబుతూ వచ్చారు. దీన్ని ఆనాటి స్వతంత్ర పోరాట నాయకులందరూ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా వివేకానందుడు లాంటివారు భారతీయ సంస్కృతి ప్రాచీనతను గట్టిగా నొక్కిచెప్పారు. ఈ దేశంలో చదువు రానివాడికి సైతం కాశీ నుంచి రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల గురించి, పుణ్యనదుల గురించి, వాటి వెనుక కథల గురించి తెలుసు. అయితే దేశ స్వాతంత్య్రం తర్వాత మన సంస్కృతికి దూరమైన ఆధునిక మేధావులు, అందులోనూ ముఖ్యంగా వామపక్ష మేధావులు. వలసవాదుల ప్రచారాన్నే ఇంకా నమ్ముతూ ఉండటం విడ్డూరం. పై పుస్తక రచయిత్రి ఈ వాదాన్ని ఖండించింది. భారతీయ సంస్కృతికి, జాతీయతా భావానికి కొన్నివేల సంవత్సరాల చరిత్ర ఉందని పుస్తకంలో పేర్కొంది. ఇటీవల జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ఆమె తన ప్రసంగంలో ఈ మాటను స్పష్టంగా చెప్పింది. ఈ ప్రసంగాన్ని యూట్యూబ్‌లో వినగలం.

జాతీయ భావన పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో వచ్చింది. Nationalism అనే భావనను 18వ శతాబ్దం తర్వాతే చూస్తాం. ఇంగ్లండ్‌ 1702లో ఒక దేశంగా ఏర్పడింది. అమెరికా 18వ శతాబ్దం చివరి వరకూ ఒక జాతిగా లేదు. మన దేశంలో గుప్తుల కాలం నుంచి విశాలమైన రాజ్యాలు పలుమార్లు ఏర్పడ్డాయి. ఇతిహాసాల్ని చూస్తే మహాభారతంలోనే ప్రస్తుతమున్న రాష్ట్రాలన్నీ వర్ణించబడి ఉండటం చూస్తాం. ధర్మరాజు నలుగురు సోదరులు నాలుగు దిక్కులకూ వెళ్లి భారతాన్నంతా జయించినట్లు భారతం చెబుతుంది. దక్షిణ దేశాన్నంతా సహదేవుడు జయించాడట. మహాభారత యుద్ధంలో ప్రస్తుతం మనం చూస్తున్న రాష్ట్రాలన్నింటి నుంచి సైన్యాలు పాల్గొన్నట్లు కనిపిస్తుంది. శ్రీరాముడు అయోధ్య నుంచి శ్రీలంక వరకూ వెళ్లిన ప్రాంతాల్ని, అలాగే వానరులు సీతను వెతకడానికి వెళ్లినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్ని వర్ణించడం రామాయణంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక సముద్రంలో ముగినిపోవడాన్ని భాగవతంలో శ్రీకృష్ణుడే ప్రస్తావించాడు. ఎస్‌ ఆర్‌ రావు అనే పురాతత్వ శాస్త్రవేత్త నేతృత్వంలో 1985 నుంచి 1989 వరకు గుజరాత్ ప్రాంతంలో సముద్రగర్భంలో జరిగిన పరిశోధనల్లో శ్రీకృష్ణుడి ద్వారకానగరం బయటపడటం మన చరిత్రకు ఒక కోణాన్నిస్తుంది. ఈ నగరం సుమారు 13వేల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా.

దేశమంతటా సామాన్య సంస్కృతి ఏర్పడడానికి ఒక ముఖ్య కారణం మనదేశం యొక్క భౌగోళిక పరి స్థితులు. ఒకవైపు హిమాలయాలు, మిగతా అన్ని వైపులా సముద్రం వ్యాపించి ఉన్న కారణంగా ఒక ప్రత్యేక ఉపఖండంగా ఉండి ఒకే సంస్కృతి వ్యాపించడానికి అవకాశం కలిగింది. అంగ, వంగ, కళింగ, కాశ్మీర మొదలైన అనేక రాజ్యాలు ఉన్నమాట నిజమే. అయినా వీటన్నిటి సంస్కృతీ ఒకటే. అందరికీ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రమాణాలు.

ఈ సంస్కృతి ఏర్పడడానికి భారతీయ రుషుల కృషి అద్భుతమైనదని చెప్పవచ్చు. అథర్వ వేదంలోనే భూమి సూక్తం అనే సూక్తంలో భరతభూమిని తల్లిగా భావించడాన్ని చూస్తాం. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఎవరు పూజకు సంకల్పం చెప్పినా ‘భరత వర్షే.. భరత ఖండే..’ అంటూ మొదలుపెట్టి తర్వాత తాము ఉన్న ప్రాంతాన్ని వర్ణిస్తారు. అలాగే కలశంలోకి పవిత్ర నదుల నీళ్లను ఆవాహన చేస్తూ ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి’ అంటూ భారతదేశంలోని ముఖ్య నదులను ప్రస్తావిస్తారు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రత్యేకించి వర్ణించింది. మత్స్యపురాణం కాశీ, ప్రయాగలను ముఖ్యంగా చెబుతుంది. వామన పురాణం కురుక్షేత్రంలోని ప్రాంతాలను, వాయుపురాణం గయ మహత్యాన్ని, పద్మపురాణం రాజస్థాన్‌లోని పుష్కర తీర్థాన్ని గురించి చెబుతాయి. స్కంద పురాణం హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అన్నింటినీ చెబుతుంది. దేశం మొత్తాన్ని సాంస్కృతికంగా ఏకం చేయడంలో స్కందపురాణం పాత్ర ఎక్కువగా ఉంది.

పురాణాలు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను, విష్ణువుకు, శక్తికీ సంబంధించిన పుణ్యక్షేత్రాలను ప్రత్యేకంగా వివరించాయి. ఉదాహరణకు శివపురాణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే భావన. సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు మొదలగు పేర్లతో ఈ జ్యోతిర్లింగాలు భరతఖండంలోని వివిధ భాగాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ తప్పనిసరిగా చూడాలని భక్తులందరూ భావిస్తుంటారు. అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలు. శక్తి యొక్క శరీరం అనేక ముక్కలుగా వివిధ ప్రాంతాల్లో పడిందట. ఇవే శక్తి పీఠాలుగా నెలకొన్నాయి. జమ్మూలోని వైష్ణవదేవి మొదలుగా అసోం లోని కామాక్షి వరకు అలాగే దేశంలోని నాలుగు మూలల్లోనూ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వైష్ణవ పుణ్య స్థలాలు కూడా దేశమంతటా కనిపిస్తాయి. ఇటీవల అపారమైన నిధులతో వార్తల్లోకి వచ్చిన కేరళలోని అనంత పద్మనాభస్వామి మొదలుగా హిమాలయాల్లోని బద్రీనాథ్‌ వరకూ దేశమంతటా వైష్ణవం వ్యాపించి ఉంది.

పుణ్యనదులకు కూడా ప్రత్యేకంగా కథలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలోని బాలకాండలో గంగానది అవతరణం ఒక ముఖ్య అంశం. భగీరథుడు తపస్సు ఫలితంగా గంగానది భూమికి రావడం అందంగా వర్ణించబడింది. కశ్యప ముని తపస్సు వల్ల సబర్మతి నది ఏర్పడిందట. అలాగే ప్రతి నదికీ ఒక పురాణగాథ ఉంది. ఒకప్పుడు పరిశుద్ధ జలాలతో ప్రవహించిన మన మూసీనది కూడా ముచుకుంద మహర్షి తపస్సు వల్ల ఏర్పడిందట.

పుణ్యనదుల్లో స్నానం చేయడం, పుణ్యతీర్థాలకు వెళ్లడం ఇతిహాసకాలం నుంచి చూడగలం. బహుశా తీర్థయాత్రలు చేసిన మొదటి ప్రముఖుడు భారతంలోని అర్జునుడు. ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంలో ఉన్న సమయంలో ఆయన సమయ భంగం చేసినందువల్ల సంవత్సరం పాటు అనేక తీర్థాల్ని సేవించాడట. ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయ భావాలు బలపడతాయి. కానీ మనదేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వం, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. చరిత్రపట్ల అవగాహన లోపం, మన సంస్కృతి పట్ల ప్రేమ లేకపోవడం ఇందుకు కారణాలు కావచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top