ప్రార్థన - వక్రతుండ మహాకాయ - Prarthana Prayer vakratunda mahakaya

megaminds
0
ప్రార్థన

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

భావము: ఓ గణపతి దేవా! వక్రమైన తొండము గలవాడువు, విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న శరీరము కలవాడవు, కోటిసూర్యుల కాంతితో ప్రకాశించువాడవు అయిన నీకు నమస్కరించుచున్నాను. నేను చేయు ప్రతీ పనియు నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము.
 
మనము ఏ పని చేయాలి అన్నా మొదట వినాయుకుని పూజ చేసుకుని మొదలు పెడతాము. ప్రతి గుడిలో మనకు మొదట దర్శనమిచ్చేది విఘ్నేశ్వరుడు.

వినాయకుని తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ వుంటారు? వారి వాహనములు ఏవి? ఇలా ప్రశ్నలు వేయండి. వినాయకుని పుట్టుక పిల్లలకు తెలియకుంటే చెప్పండి.

కథ: ఒకసారి శివపార్వతులు వినాయకునికా లేక సుబ్రహ్మణ్య స్వామికా ఎవరిని గణములకు అధిపతి చేయాలా అని వారికి పరీక్ష పెట్టారు. ఎవరు 3 సార్లు భూప్రదక్షణ చేసి ముందుగా ఎవరు ఇక్కడికి వస్తారో వారిని గణములకు అధిపతిని చేస్తాము అని చెపుతారు. వెంటనే నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి బయలు దేరెను. వినాయకుడు ఆలోచించాడు ఎలుక వాహనం త్వరగా వెళ్ళదు. ఎలా అని ఆలోచించసాగాడు. అంతలో సుబ్రహ్మణ్య స్వామి రెండు ప్రదక్షణములు ముగించెను. వెంటనే వినాయకుడు లేచి తల్లిదండ్రులు చుట్టూ 3 ప్రదక్షణములు చేసెను. వారితో నేను ముందుగా వచ్చాను అన్నాడు. ఎలా అని శివపార్వతులు అడుగగా సృష్టికి మూల కర్తలు మీరు అందుకే మీకు ప్రదక్షణ చేస్తే విశ్వానికే చేసినట్లు కదా అనెను. వినాయకుడు చాలా సూక్ష్మ బుద్ధి కలవాడు. అందుకే వినాయకునికి గణపతి అని మరొక పేరు. ఇంకా ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు , గజానన, లంభోదరుడు మొదలగు పేర్లు కలవు.

(పిల్లలు అర్థము చేసుకోగలిగితే వినాయకుని చేతిలో వున్న వాటిని గురించి చెప్పవచ్చు.)

గణపతికి 4 హస్తములు వుండును. చతుర్వేద పారంగతుడు అగుటచేత చతుర్బుజుడాయెను. ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో త్రాడు(పాశము), ఒక చేతిలో మోదకము ( అన్నముతో తయారైన వంటకము) ఉండగా, నాలుగవ హస్తముతో ఆశీర్వదించు చుండును. తనదరి చేరిన మానవుల యందలి పాపములను, వాసనలను తెగ నరుకును. పాప ఖండన జరుగగానే తన చేతి యందు గల త్రాడుతో అట్టి సజ్జనులను తన దగ్గరకు చేర్చుకొనెను. అలా దగ్గరకు చేర్చుకొనిన జనులను 3 వ హస్తమునందున్న మోదకమును అనగా జ్ఞానమును అందించును. జ్ఞానము కలిగి ఆనందపరులై ఉన్న ముక్తార్మలను తన నాల్గవ హస్తముచే ఆశీర్వదించును.
 
వక్రతుండ: తొండము వంకరగా వుంటుంది. అది ఓంకారమును సూచిస్తుంది. అందువలననే ప్రణవ స్వరూప అని వినాయకుని స్తుతిస్తాము. ఏనుగు తొండముతో ఎంతటి బరువు వస్తువులైనా సులభముగా ఎత్తుతుంది. అంతేకాకుండా చిన్న సూదిని కూడా తీస్తుంది. అడవిలో గజము ఒకసారి ముందుకు వెళితే దారి ఏర్పడుతుంది. మనము సులభముగా ఆ దారిలో వెళ్ళవచ్చు. బుద్ధి చాలా సూక్ష్మము.
 
ఏకదంతుడు అనగా వ్యాసుడు భారతాన్ని, నిలుపకుండా చెపుతూ వుండగా వినాయకుడు నిలుపకుండ రాయాలి. వినాయకుడు వ్రాస్తుండగా కలము (ఘంటం) విరిగిపోతుంది. వెంటనే ఆలస్యం చేయకుండా తన దంతం పీకి వ్రాస్తాడు. అందుకే ఏకదంతుడు అని అంటారు. ఇది త్యాగమునకు గుర్తు. మొదలు పెట్టిన కార్యము అడ్డంకులు వచ్చినా నిలుపకూడదు అని తెలుపును.
 
మోదకము అనగా ఉండ్రాళ్ళు. ఏనుగు శాఖాహారి, అనగా సాత్వికమైన ఆహారం తీసుకుంటుంది. మనము ఉండ్రాళ్ళు తయారు చేసినప్పుడు నువ్వులూ, బెల్లము వాడుతాము. ఉండ్రాళ్ళు ఆవిరితో చేస్తారు. అనగా ఆయిల్ లేకుండా చేస్తారు. అందువల్ల తేలికగా జీర్ణము అవుతాయి. బెల్లం వలన మనకు ఐరన్ అభివృద్ధి అవుతుంది. నువ్వులు రక్తమును శుద్ధి చేయును.
 
ఎలుక వాహనము అనగా చీకటిని అదిమి పెట్టి అజ్ఞానమును తొలగించి, జ్ఞానము, ప్రకాశమును ఇచ్చును. మామూలుగా ఎలుకలు ఆహార పదార్థమును ఒక చోట వున్నవి తృప్తిగా తినక కొద్దిగా కొరికి మరలా వేరే చోటికి వెళ్ళి అక్కడ కొరికి చివరకు బోనులో పడుతుంది. అనగా రుచులను అరికట్టు కోవాలని తెలుపుతుంది.
 
ఇక వినాయక తత్వము - మనకు జ్ఞానము, ఆహారము, ఆనందము, ఐశ్వర్యమును ఇచ్చును.

మనము తెలుసుకున్న కథలో నీతి ఏమిటో చెప్పగలరా అని పిల్లల్ని అడగాలి వాళ్ళు చెప్పలేదా అప్పుడు గురువు చెప్పాలి.

గణపతి తన తల్లి తండ్రికి ఇచ్చిన గౌరవము వల్లనే అంతటి గొప్పవాడు అయ్యాడు. అందరిచే ముందుగా పూజింపబడుతున్నాడు. కనుక ఈ కథలో మనం తెలుసుకున్నది తల్లితండ్రులను గౌరవించాలి. అని, అది ఎట్లా? అంటే రోజు నిద్రలేచాక కాని, స్కూలుకి వెళ్ళే ముందు కాని మన అమ్మ, నాన్నలకి, ఇంట్లో వున్న పెద్దలకి నమస్కారము పెట్టుకోవాలి. మేం గురువులు కూడా ఇలా చేసే మీకు చెపుతున్నాం. ఒక వేళ అమ్మ నాన్నలు మా వద్ద లేకపోతే వారి ఫోటోలకి నమస్కారము పెట్టుకుంటాము.

#Prayer #Prarthana

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top