సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం - శ్రీ రాంపల్లి మల్లిఖార్జున్ - About Gandhi ji in telugu - megaminds

megaminds
0
అక్టోబర్ 2, 2020 కి మహాత్మాగాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అయి 151 లో అడుగు పెడుతున్నది, 150 సంవత్సరాలకు పూర్వం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి, ఏమి అనుసరించాలి, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గడించిన గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటం కి నాయకత్వం వహించడానికి ముందు 1893 నుండి 1914 సంవత్సరం వరకు దక్షిణాఫ్రికాలో ఉన్నారు, అక్కడ బ్రిటిష్ వాళ్ళ వివక్షతకు వ్యతిరేకంగా కోర్టులలోకూడా పోరాటం చేశారు, అక్కడే బ్రిటిష్ వాళ్ల దుర్మార్గానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం కూడా చేశారు, సత్యాగ్రహం అనే పదాన్నిగాంధీజీ మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో ప్రయోగించారు.

ఒక ప్రక్క దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూ, ఇంకొక ప్రక్క భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లా నడపాలో ఆలోచించటం ప్రారంభించారు, దానిలో భాగమే 1909వ సంవత్సరంలో హిందూ స్వరాజ్ అనే పుస్తకం రచించారు దీన్ని లండన్ పట్టణంలో ఉన్న తన భారతీయ మిత్రులకు, తనతో సన్నిహిత సంబంధం ఉన్న ఆంగ్లేయులకు కూడా పంపించాడు, భారతదేశంలో స్వతంత్ర పోరాటం యొక్క రూపురేఖలు గాంధీ భావాలు ఆ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలోనే 1912 సంవత్సరంలో గోపాలకృష్ణ గోకులే గాంధీజీని కలుసుకొని అనేక విషయాలు చర్చించారు అప్పటి నుండే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది, గాంధీజీ 1914 సంవత్సరం ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కొంతకాలం గడిపారు. ఆ సమయంలో కూడా గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే తో చాలావిషయాలు చర్చించారు అట్లాగే కొందరు ప్రముఖులైన ఆంగ్లేయులతో గూడా మాట్లాడటం జరిగింది, షుమారుగా భారత స్వాతంత్ర ఉద్యమం లో తన భాగస్వామ్యం ఏమిటి అనేది స్పష్టత వచ్చిన తరువాత 1915 వ సంవత్సరం,గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు.

ఆ సమయంలో గోపాలకృష్ణగోఖలే గాంధీజీకి రెండు సలహాలు ఇచ్చారు 1. దేశంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కొంతకాలం దేశంలో తిరిగి రమ్మని చెప్పారు 2. ఒక సంవత్సరం పాటు దేశంలో జరుగుతున్న కార్యకలాపాలు, స్వతంత్ర పోరాటం మొదలైన వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు ఆ ప్రకారం గాంధీజీ, దేశం లో ప్రముఖ ప్రదేశాలు గ్రామీణ ప్రాంతం, గిరిజన ప్రాంతాలు తిరిగారు. ఆ సమయంలో దేశంలో కొన్ని విషయాలు గాంధీజీని ప్రభావితం చేశాయి, కొన్ని విషయాలు గాంధీజీని ఆలోచింప చేసాయి, ఇంకా కొన్ని విషయాలు గాంధీజీ మనసును కదిలించాయి.
ప్రభావితం చేసిన విషయాలు 1. భగవాన్ శ్రీ రామ చంద్రుడు ఈ దేశం అంతరిక శక్తి అని గుర్తించాడు, ఇది గాంధీజీని చాలా ప్రభావితం చేసింది, అందుకే ఈ దేశంలో సామాన్య ప్రజలను కదిలించటానికి రామరాజ్యం నిర్మాణం చేసుకొందామని పిలుపునిచ్చారు.  2. ఈ దేశ ప్రజలలో సత్యం, ధర్మం ఎడల ఉన్న నిష్ఠ గాంధీజీ గుర్తించారు. 3. ఈ దేశం అంటే గ్రామీణ దేశమని కూడా గాంధీజీ గుర్తించారు. బ్రిటిష్ పరిపాలనలో ధ్వంసమైన గ్రామీణ క్షేత్రం గాంధీజిని బాగా కదిలించివేసింది. దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా గ్రామీణ ప్రజల జీవనాన్ని చూసి గాంధీజీ ఆశ్చర్యపోయారు, ఈ దేశంలో గ్రామీణ ప్రజల మనసులు జయించాలని నిశ్చయించుకున్నారు, అందుకే తన జీవన శైలిలో చాలా పెద్ద మార్పు తెచ్చుకున్నారు. కొల్లాయి గుడ్డ కట్టుకొని సాధారణ వ్యక్తులలో కలసిపోయారు, అట్లాగే సత్యాగ్రహాల ద్వారా స్వాతంత్ర పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయంచుకొన్న గాంధీజీ 1915 వ సంవత్సరంలోనే సత్యాగ్రహ ఆశ్రమాన్ని నిర్మాణం చేయించారు అప్పటినుండి ఆశ్రమ జీవనం గడపటం ప్రారంభించారు. అట్లాగే ఈ దేశ గ్రామీణ క్షేత్రంలో మార్పులు తెచ్చేందుకు చేసే ప్రయత్నాల కోసం 1917లో సబర్మతి ఆశ్రమం ప్రారంభించారు.

ప్రపంచంలో ఏ దేశమైనా అన్యాక్రాంతం అయినప్పుడు దాని ముందు రెండే మార్గాలు ఉంటాయి, 1. ఆక్రమించిన శక్తులకు లొంగిపోవడం. 2. ఏదో రూపంలో స్వతంత్రాన్ని సంపాదించడం. ప్రపంచం లో చాల దేశాలు విప్లవ కార్యకలాపాల ద్వారా తన స్వతంత్రాన్ని సంపాదించుకున్నాయి. భారతదేశం బ్రిటిష్ వాళ్లకు అణిగిమణిగి ఉండలేదు, అట్లా అని హింసా మార్గంలో కూడా ప్రయాణించ లేదు, ఆ కాలంలో ఈ దేశంలో జన్మించిన అనేక మంది మహా పురుషులు అంతర్ముఖులై ప్రపంచంలో ఇంత గొప్ప సంస్కృతి, నాగరికత కలిగిన దేశం ఎందుకు పరాధీనం అయిందో ఆలోచించారు, కారణాలను విశ్లేషించారు ఆ లోపాలు సరిచేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పరంపరలో రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద, అరవింద, తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర, లాలాలజపతిరాయ్, గోవింద రానడే, మొదలైనవారు ఒక్కొక్కరు ఒకొక్క పద్ధతిలో ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటానికి మానసికంగా సిద్ధం చేస్తూ ఒక గొప్పభావ విప్లవాన్ని సృష్టించారు. 

గాంధీజీ ఎంచుకొన్న మార్గం రాజకీయ పోరాటం, సంస్కరణల ఉద్యమం: గాంధీజీ నిర్వహించిన స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహం మౌలికమైన అంశం, సత్యాగ్రహము అంటే నిర్భయత్వం అంటే మనం ఎవరికీ భయపడం, ఎవరిని భయపెట్టము న్యాయమైన మన లక్ష్యం సాధించుకోవటం. ఈ సత్యాగ్రహం ప్రపంచంలో అందరినీ ప్రభావితం చేసింది గాంధీజీ చనిపోయిన తర్వాత జనరల్ మెక్ ఆర్ధర్ పంపిన సంతాప సందేశంలో ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం గాంధీజీ సత్యాగ్రహం మాట వినవలసి వస్తుంది అంతకుమించి గత్యంతరం లేదు. అట్లాగే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టైన్ ఒకప్పుడు ఈ భూమిపై రక్తమాంసాలు ఉన్న ఇలాంటి ఒక వ్యక్తి సంచరించారు అనే వాస్తవాన్ని రాబోయే తరాలు నమ్మటం కష్టం అని గాంధీజీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు, స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేతిలో అడవిలోని గడ్డి ,సముద్రంలోని ఉప్పు, నూలు వడికే చరఖా, బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగులేని అస్త్రాలు. ఆ అస్త్ర ప్రయోగం కి దేశ ప్రజలను సిద్ధం చేశారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ప్రయోగ శాలలో జరిగితే, ప్రజ లలో సత్యం, ధర్మం గుణ వికాసానికి సమాజమే పెద్ద ప్రయోగశాల. ఈ దిశలో ఈ దేశంలో అనేక ప్రయోగాలు నిర్వహించబడ్డాయి ఆ దిశలో గాంధీజీ కూడా తన ప్రయత్నాలు తాను చేశారు. గాంధీజీ పోరాటంలో కొన్ని అపశృతులు కూడా దొర్లాయి దాని పరిణామాలు దేశం తదనంతర కాలంలో చవి చూడ వలసి వచ్చింది, అందులో ప్రముఖమైనది ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ సమర్థించటం దాని పరిణామం చివరకు ఈ దేశ విభజనకు దారితీసింది, దేశానికి స్వాతంత్రం హిందూ ముస్లిం ఐక్యతతోనే వస్తుంది అనే ఆలోచనతో చేసిన ప్రయత్నాలు తప్పుదారి కూడా పట్టాయి, మొత్తం మీద గాంధీజీ స్వాతంత్ర పోరాటానికి తిరుగులేని నాయకుడు.

గాంధీజీ కాంగ్రెస్ సంస్థలో 1920 నుండిస్వాతంత్ర పోరాటం చేసారు. 1934లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఒక ట్రస్టీ గా కాంగ్రెస్ కు మార్గదర్శనం చేసుకొంటూ వచ్చారు 1947లో దేశానికీ స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ సంస్థను రద్దు చేయాలని గాంధీజీ చెప్పారు ఎందుకంటే స్వాతంత్రం సంపాదించేందుకు కాంగ్రెస్ ఏర్పడింది, ఆ పని పూర్తయింది కాబట్టి దాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ సంస్థను లోక సేవక సంఘగా మార్చాలని గాంధీజీ చనిపోవటానికి ఒకరోజు ముందు ఒక వీలునామా రాశారు దానిలో గాంధీజీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పటికీ గాంధీజీ తరువాత ప్రభుత్వానికి ,పార్టీకి నాయకత్వం వహించిన పెద్దలు గాంధీజీ ఆలోచనలు తుంగలో తొక్కారు.

గ్రామాల గురించి గాంధీజీ ఆలోచనలు: దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సర్వోదయ కార్యక్రమాలే లక్ష్యం కావాలని గాంధీజీ చెబుతుండేవారు, అంటే గ్రామం అన్ని విధాల వికాసం అభివృద్ధి చెందాలి అప్పుడే గ్రామాలు తమ కాళ్ల మీద తాము నిలబడతాయి గ్రామం అంటేనే వ్యవసాయం ఈ వ్యవసాయంతో పాటు గ్రామంలో కుటీర పరిశ్రమల ద్వారా గ్రామానికి అవసరమైన వస్తువులను గ్రామంలోని తయారుచేసుకోవాలి అట్లా గ్రామము స్వావలంబన కావాలి అనేది గాంధీజీ ఆకాంక్ష. ఇంగ్లాండ్ దేశంలో విద్యాబోధనలో ఈత నేర్పడం ఓడ నడపటం ఒక భాగంగా ఉండేవి ఎందుకంటే ఇంగ్లాండుకు నాలుగు వైపులా సముద్రంఉన్నది. అట్లాగే మనదేశం గ్రామీణదేశం, ఈ దేశంలో విద్యాబోధనలో గ్రామీణ వృత్తులు కూడా భాగం కావాలని గాంధీ చెప్పారు, దేశంలో ఉత్పత్తి ఎట్లా ఉండాలి అంటే మనకు కావలసింది మాస్ ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ బై మాస్ కావాలి అని చెప్పారు, అధికోత్పత్తి కంటే అధిక జనుల ద్వారా ఉత్పత్తి చేయటం, దానినే వికేంద్రీకరణ అంటారు. భారతదేశం లో వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం సాధించినప్పుడే దేశం బాగుపడుతుంది అని గాంధీజీ చెప్పారు. 

ఋగ్వేదం లో గృహే గృహే దమే దమే అన్న వాక్యం ఉన్నది అంటే ప్రతి ఇంటిలో సాధన జరుగుతూ ఉండాలి దానితో కుటుంబంలో ఒక ఆత్మీయ భావము, క్రమశిక్షణ, నిరంతర పరిశ్రమ నేర్పబడాలి అని దాని భావం. అట్లాగే గాంధీజీ ట్రస్ట్ షిప్ అంటే ధర్మకర్తృత్వ గురించి చెబుతూ ఉండేవారు ట్రస్ట్ ఎట్లా ఉండాలి అంటే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధాల వలె ఉండాలని చెప్పారు, కుటుంబంలో పిల్లలు తమ బాధ్యతను తాము నిర్వహించే సామర్థ్యం వచ్చే వరకు తల్లిదండ్రులు తమ కంటే ఎక్కువగా అ పిల్లల గురించి ఆలోచిస్తారు, ఆ స్వభావం దృష్టిలో ఉండాలని చెప్పారు. స్వదేశీ స్వాలంబన విషయాలు చెప్పారు. ఈ విషయాలను వినోబాభావే ఉన్నంత కాలం కోన సాగించారు. ఆ తదనంతరం గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్ గ్రామ వికాసం, అట్లాగే స్వదేశీ గురించి కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు.

ఒక రకంగా చెప్పాలంటే గాంధీజీ ఆలోచనలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లో కనపడతాయి, సంఘంలో గ్రామ వికాసం స్వదేశీ, వికేంద్రీకృత వ్యవస్థలు అన్నీ ఒక భాగం. ఈ దేశం ఈ దేశం గా నిలబడాలంటే ఈ దేశానికి సంబంధించిన పరంపరాగత ఆలోచనలను కాలానుగుణ్య మైన మార్పులు చేసుకుంటూ పని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ ఆలోచనలు గాంధీజీ లో ఎట్లా ఉన్నాయో సంఘంలో కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత ఈ దేశం ఈ దేశంగా అభివృద్ధి చెందే దిశ లో గాంధీజీ ఆలోచనలతో ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతున్నది.

నరేంద్రమోడీ ఈ మద్యఒక దగ్గర మాట్లాడుతూ గాంధీజీ ఆదర్శాలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా మనం ఏమి చేయగలం? సరికొత్త ఆలోచనలతో గాంధీజీ ఆదర్శాలను ప్రజల ముందుంచాలని, మేధావులు, నవ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగంలో దిగ్గజాలను ఆహ్వానిస్తున్నాను. అసహనం, బాధితులకు తావులేని సుఖ సంపన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు మనం భుజం భుజం కలిపి నడుద్దాం అప్పుడే ఇతరుల బాధ తన బాధగా భావిస్తూ ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఇతరుల బాధలను దూరం చేయటానికి ప్రయత్నిస్తాం, గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ జనతోపాట లో చెప్పినట్లు అసలైన మనిషి అర్థం ను సాకారం చేయటమే మనంగాంధీజీకి సమర్పించే నిజమైననివాళి అవుతుంది అని చెప్పారు. శ్రీ రాంపల్లి మల్లిఖార్జున్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top